భూపాలపల్లి అర్బన్: క్రీడల్లో నైపుణ్యాల పెంపునకు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్ ఉపయోగపడుతుందని డీవైఎస్ఓ చిర్ర రఘు తెలిపారు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో ’స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఆన్ వీల్స్’ కార్యక్రమం నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్ నిపుణులైన కోచ్లు జిల్లాలోని పీడీలు, పీఈటీలు, క్రీడా సంఘాల సభ్యులు, క్రీడాకారులకు ఒకరోజు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మెళకువలతో పాటు ఫిజియోథెరపీ చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్థులు, జిల్లా యువజన, క్రీడలశాఖ సిబ్బంది శివసాగర్ పాల్గొన్నారు.


