● నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించాలి
● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మల్హర్: తాడిచర్ల ఓసీపీ–2 గని సింగరేణి సంస్థకు ఎంతో కీలకమైన ప్రాజెక్టు అని, ఈ గనిని వీలైనంత త్వరగా ఉత్పత్తిలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఇటీవల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు కేటాయించిన తాడిచర్ల ఓసీపీ–2 ఉపరితల బొగ్గు గనిని శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకష్ణ, సింగరేణి భూపాలపల్లి జీఎం ఏనుగు రాజేశ్వర్రెడ్డితో కలిసి సందర్శించి ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. గని ప్రారంభానికి అవసరమైన మెటీరియల్, భారీ యంత్రాలు, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గని అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. నిర్ణయించిన గడువులోగా పనులను పూర్తిచేసి ఓసీపీ–2 గనిని ప్రారంభించేందుకు కృషి చేయాలని సూచించారు. గని ప్రారంభం ద్వారా సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెరగడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి ఎంపీ గడ్డం వంశీకష్ణను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గని ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎంపీకి వివరించి, చేపట్టాల్సిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. కార్యక్రమంలో ఏరియా ఇన్చార్జ్ ఎస్ఓటు జీఎం కృష్ణ ప్రసాద్, సర్వే అధికారి శైలేంద్రకుమార్, ఎస్టేట్ అధికారి బబుల్రాజ్, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ పాల్గొన్నారు.


