భూపాలపల్లి అర్బన్: విద్యార్థుల అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బి.బాలునాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు సదానందం, అనిల్కుమార్, రాజు, నరేష్ గొల్లబుద్దారం, చికెన్పల్లి, పంబాపూర్, అజాంనగర్, నందిగామ, దీక్షకుంట, లంబాడీతండా, పలు గ్రామాల్లో పర్యటించి విద్యార్థులు, తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా కళాశాలలో అందుబాటులో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఏసీఈసీ గ్రూపులు తెలుగు, ఇంగ్లిషు మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, గ్రంథాలయ వసతి, స్కాలర్షిప్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. సైన్స్ విద్యార్థులకు ఆధునిక ప్రయోగశాలలతో పాటు ప్రత్యేక ఐఐటీ–జేఈఈ, నీట్ కోచింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ప్రభుత్వ పర్యవేక్షణలో అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి, నీట్, ఈఎంసెట్ పరీక్షలకు పూర్తి ఫీజు రాయితీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దూర ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు పాస్ సదుపాయం, విశాలమైన భవనాలు, అనుభవజ్ఞులైన ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన విద్యాబోధన కళాశాల ప్రత్యేకతలని వివరించారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ప్రభుత్వ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు.
జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రచారం


