గ్రామ పంచాయతీల బలోపేతమే తమ లక్ష్యమని.. గ్రామాల అభివృద్ధే ముఖ్యమని పాలకులు రోజూ చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటిమూటలుగానే మిగులుతున్నాయి. చిట్యాల మండలం ఏలేటిరామయ్యపల్లిలో గ్రామ పంచాయతీకి స్థలంతో పాటు భవనం లేకపోవడంతో శనివారం మండల అధికారులు పోచమ్మతల్లి దేవాలయం చెట్టు నీడన గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన గ్రామసభ.. సొంత భవనం లేక చెట్టునీడన సాగడం స్థానిక స్వపరిపాలన దయనీయ స్థితికి అద్దం పడుతోంది. అధికారులు గ్రామపంచాయతీకి స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలని సర్పంచ్ కొడారి అశోక్ కోరారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తహసీల్దార్ వసంతరావు తెలిపారు. – చిట్యాల


