● ఎంపీ డాక్టర్ కడియం కావ్య
● అంతర్జిల్లా బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: ప్రతిభను చాటుకునేందుకు క్రీడలు ఉత్తమ వేదిక అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 11వ యూత్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఎంపీ కావ్య ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించిన ఎంపీ బాస్కెట్బాల్ గోల్ వేసి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, బాస్కెట్బాల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, జెన్కో సీఈ ప్రకాశ్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, క్రీడా అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.


