ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. 2026 అక్టోబర్ 1ను అర్హత తేదీగా నిర్ణయించి ప్రత్యేక ఓటరు సవరణ షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని చెప్పారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
గ్రామ, వార్డు సభలను నిర్వహించాలి
ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డుల్లో గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్తో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రామసభల్లో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, మహిళల రక్షణ, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, రహదారి భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మా ట్లాడుతూ.. గ్రామ, వార్డు సభల్లో పోలీసు అధికారులు పాల్గొని ప్రకృతి వైపరీత్యాలు, రహదారి భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఆటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్రెడ్డితో కలిసి ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించేందుకు క్లాత్ బ్యాగులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగం వల్ల భూమి, నీరు కలుషితమవడంతోపాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సీపీఓ జవహర్, డీఈఓ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ


