మల్హర్(కాటారం): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సోమవారం కాటారం మండలం దన్వాడ గ్రామంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి శ్రీధర్బాబు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసి వారికి నూతన వస్త్రాలను అందజేశారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండాలల్లోని 300 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. కొత్త భవనం అందుబాటులోకి రావడం ద్వారా గ్రామ ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలను బస్సులకు అధిపతులను చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, ఆర్డీఓ రవీందర్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాంబాబు, కాటారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుమల పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కాళేశ్వరం: అర్హులైన ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మహదేవపూర్ మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు గృహసౌకర్యం కల్పించడంలో కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. కలెక్టర్ రాహుల్శర్మ మాట్లాడుతూ పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
కాటారం, మహదేవపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు


