● కలెక్టర్ రాహుల్ శర్మ
మల్హర్(కాటారం): జిల్లాలో ధాన్యం దిగుమతుల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం కాటారం మండలం రేగులగూడెంలోని రుద్ర జిన్నింగ్ మిల్లు, మీనాక్షి ఆగ్రో జిన్నింగ్ మిల్లులో జరుగుతున్న ధాన్యం దిగుమతి ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, వారి పంటకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం దిగుమతులలో జాప్యం లేకుండా అవసరమైన హమాలీలను అందుబాటులో ఉంచి అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు వివరించారు. లారీల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఇసుక రవాణాకు ఉపయోగించే లారీలను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని తెలిపారు. ఈ మేరకు టీఎస్ఎండీసీ ప్రాజెక్టు అధికారి రామకృష్ణకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. ఇసుక రవాణా లారీల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు, గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోకుమార్, తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


