అధికారులకు ఎస్పీ సన్మానం | - | Sakshi
Sakshi News home page

అధికారులకు ఎస్పీ సన్మానం

May 31 2026 1:30 AM | Updated on May 31 2026 1:30 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్‌ అధికారులను పోలీస్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ హాజరై అధికారుల సేవలను కొనియాడారు. పోలీస్‌ ఉద్యోగం అత్యంత బాధ్యతాయుతమైనదని, విధుల నిర్వహణలో కుటుంబ సౌకర్యాలను త్యాగం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేసిన అధికారుల సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కుటుంబ సభ్యులతో సమయం గడపాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐలు సంధి ప్రతాపరెడ్డి, మదన నాగయ్య, చింత సుధీర్‌, ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మాచర్ల వైకుంఠంను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ ఆర్‌ఐ రత్నం, వెల్ఫేర్‌ ఆర్‌ఐ సంతోష్‌కుమార్‌, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

ఆవిర్భావ వేడుకలకు

అతిథులు వీరే..

భూపాలపల్లికి ప్రభుత్వ విప్‌ యెన్నం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్‌ 2) సందర్భంగా జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖులను నియమించింది. హనుమకొండకు రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌కు అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ములుగుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), జనగామకు ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, జయశంకర్‌ భూపాలపల్లికి ప్రభుత్వ విప్‌ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌కు ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాల వద్ద పుష్పాంజలి ఘటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement