సంక్షేమం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కోఆర్డినేటర్లు, ఎస్సీ కార్పొరేట్ ఈడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వి ద్యార్థుల భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం, అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ఫలితాల కోసం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపకూడదని, వసతి గృహాల్లోకి బయటి వ్యక్తులు రానివ్వొద్దన్నారు. ప్రతీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని, షీటీమ్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ వసతి గృహాల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నుంచి రూ.6 కోట్లు మంజూరు చేశామన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలపై శాఖల అధికారులు నివేదికలు అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని, ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొరికిశాల, భూపాలపల్లి అర్బన్ పాఠశాల ఘటనపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకున్నారన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో..
జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్శర్మ, స్నేహశబరీష్, సత్యశారదలు మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అద్దె భవనంలో ఉంటున్న హాస్టళ్లకు బిల్లులు రాకపోవడంతో యాజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హాస్టళ్లలో ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంత్నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పీఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ పోస్ట్మెట్రిక్ హాస్టల్ను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
అధికారులు హాస్టళ్లలో పర్యటించాలి
మెనూ ప్రకారం భోజనం అందించాలి
ఎస్సీ, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్


