భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రతి ఏడాది మలేరియా కేసులు నమోదవుతున్నాయని వాటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో డీఎంహెచ్ఓ మధుసూదన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పలు గ్రామాలు ఏజెన్సీలో ఉండటం వలన సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని.. దోమలు వృద్ధి చెందకుండా పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకొని ఇంటి పరిసరాల్లో మురికి నీరు, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మలేరియా పట్ల అవగాహన కల్పించిన పలువురికి ఈ సందర్భంగా అవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, ఉమాదేవి, వైద్యాధికారులు పాల్గొన్నారు.