
పరీక్షల పేరుతో వసూళ్లు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రక్త పరీక్షల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆస్పత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చిన పేషెంట్లను డాక్టర్లు పరీక్షించి వివిధ రకాల రక్త పరీక్షలు రాస్తున్నారు. అందులో భాగంగా కొంతమందికి ‘ఎలక్ట్రోలైట్స్’ రక్త పరీక్షను కూడా రాస్తున్నారు. రక్త పరీక్షకు సంబంధించి పరికరాలు అందుబాటులో లేకపోవడంతో బయట చేసుకోవాల్సి ఉంటుందని ల్యాబ్ టెక్నీషియన్లు రోగులకు చెబుతున్నారు. ఈ పరీక్ష ప్రైవేట్ ల్యాబ్లో చేయాలంటే రూ.800 ఉంటుందని వసూళ్లు చేస్తున్నట్లు పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లో రూ.300నుంచి రూ.500వరకు ఖర్చు అవుతుండగా అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రోలైట్స్ పరీక్ష చేయకుండానే హైదరాబాద్, వరంగల్కు చెందిన ల్యాబ్ ప్యాడ్స్పై సొంతంగానే ప్రింట్ తీసి పేషెంట్లకు అందజేస్తూ మోసం చేస్తున్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు నర్సింగ్ అధికారులు ఈ దందాకు తెరలేపినట్లు ఆస్పత్రిలో చర్చించుకుంటున్నారు.
చర్యలు తీసుకుంటాం..
ఆస్పత్రిలో టెస్టు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్కు పంపకతప్పడం లేదు. త్వరలో నేరుగా ప్రైవేట్ ల్యాబ్ వారితో మాట్లాడి వారి వచ్చి నమూనాలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఇందుకు అయ్యే ఖర్చు ఆస్పత్రి నుంచి చెల్లిస్తాం. అక్రమ దందాను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీనిపై విచారణ చేస్తున్నాం.
– డాక్టర్ నవీన్కుమార్,
ఆస్పత్రి సూపరింటెండెంట్