● ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
● వినతులు విని సిబ్బందికి ఆదేశాలు
● ప్రజల నుంచి 86 దరఖాస్తుల స్వీకరణ
జనగామ రూరల్: కుమారులు పట్టించుకోవడం లేదని, ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని, భర్త నుంచి రావల్సిన భూమి ఇవ్వడం లేదని, కుమారుడు భూమి ఆక్రమించుకున్నాడని..ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణికి ప్రజలు పోటెత్తారు. ఈసందర్భంగా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వారి వినతులను ఆలకించి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని భరోసా కల్పించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలో మ్తో కలిసి అయన 86 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఆర్డీఓ వసంత, జిల్లా పౌరసరఫరాల అధికారి సరస్వతి, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు కొన్ని ఇలా..
● జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన లోకిని కిష్టయ్య, తనకు సర్వే నంబర్ 173లో 7 గుంటలు, 324/బీలో 36 గుంటల భూమి కలదని, తన పేరున పట్టా పాస్ బుక్ జారీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
● కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన నలమాస నర్సమ్మ, తన భర్త కల్లు గీత కార్మికుడిగా చేస్తూ అనారోగ్యంతో మరణించాడని, తాను ఒంటరి మహిళ అయినందున పింఛన్ ఇప్పించాలని వేడుకుంది.
● జఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల స్వప్న, తనకు ఎకరం 27 గుంటల భూమి కలదని, ఆ భూమిని రికార్డులో తన పేరును నమోదు చేయించాలని వినతిపత్రం అందించింది.
● రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి చెందిన తురిగొండ విమల తన భర్త రాములు మరో వివాహం చేసుకొని తనను ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయింది. తన భర్త పేరుమీద ఉన్న 5 ఎకరాల భూమిలో తనకు వాటా ఇవ్వాలని కోర్టులో కేసు నమోదైనా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం చేయాలని కోరింది.
కుమారులు పట్టించుకోవడం లేదు
పై ఫొటోని వృద్ధురాలి పేరు గురిజాల బాలమణి. 70 ఏళ్ల వృద్ధురాలు. జనగామ మండలంలోని సిద్దెంకి గ్రామం. ఆమెకు ఇద్దరు కుమారులు. గ్రామంలో ఆమెకు పసుపుకుంకుమ కింద వచ్చిన భూమి 4ఎకరాలు కుమారులకు గిఫ్ట్ రిజస్ట్రేషన్ చేసింది. ఇప్పుడు తన బాగోగులు చూసుకోవడం లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్నానని కలెక్టర్ పట్టించుకొని న్యాయం చేయాలని వేడుకుంది. దీంతో కలెక్టర్ తక్షణం స్పందించి వారం రోజుల్లో సమస్య పరిష్కారించాలని ఆర్డీఓను, సంబంధిత అధికారులను ఆదేశించారు.


