జనగామ: కనుచూపుకు కనిపించని నులిపురుగును నిర్మూలిద్దాం. పిల్లలకు ఆరోగ్యంపై శ్రద్ధ వహిద్దాం. చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నప్పుడే చదువులో, జీవితంలో రాణిస్తారు. తల్లిదండ్రులు ప్రత్యేక పర్యవేక్షణతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించి, శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పాటునందించాలి. నులిపురుగు పేగులో రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ రక్తహీనతకు కారణమవుతుంది. అధికశాతం అనారోగ్య సమస్యలకు కారమవుతున్నాయి. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 11వ తేదీన నులి నివారణ మందుల పంపిణీకి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసుకుంటుంది.
వ్యాప్తి ఇలా..
కలుషిత ఆహారం, ఈగలు వాలుతూ..దుమ్ముదూళి పడిన పదార్థాలు తినడం వలన వ్యాప్తి చెందుతుంది. బహిరంగ ప్రదేశాల్లో కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లకు వెళ్లడం ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, వంట సరుకులను శుభ్రమైన నీటితో కడగకపోవడం, తినే ముందు, తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకోకపోవడంతో కూడా వస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉంచడం వల్ల నులిపురుగుల లార్వాలు జీర్ణకోశంలోకి ప్రవేశిస్తాయి.
రకాలు ఇవీ
నులిపురుగుల్లో బద్దె, నట్టలు, కొంకి, కొరడా, ఏలిక పాములు, దారపు, నీరుగడ్డ వంటి రకరకాల నులి పురుగుల రకాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ శాతం చిన్నారుల పొట్టల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
లక్షణాలు ఇవే..
మలం వెళ్లే మార్గంలో దురద, అజీర్ణం, వాంతులు, విరేచనాలు, పొడి దగ్గు, నీరసం, కాలేయం పెరగడం, ఆడపిల్లల్లో తెల్లబట్ట కావడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, బరువు తగ్గడం, పోషకాహారలోపం, కడుపు నొప్పి, చదువులో ఏకాగ్రత లేకపోవడం, ఎదుగుదల తగ్గడం, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
భోజనానికి ముందు ఆటలు, మలవిసర్జన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రత పాటించడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి. తీపి పదార్ధాలను పిల్లలకు దూరంగా ఉంచాలి. తినే సమయంలో వేడి పదార్థాలను ఉండేలా చూసుకుంటూ, మలబద్దకం రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలి.
రేపటి నుంచి
ఈ నెల 11వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేయనున్నా రు. 11న గోలీలు వేసుకోలేని పిల్లలకు 18వ తేదీన మాప్డే పురస్కరించుకుని వేయనున్నారు.
శిక్షణ పొందిన వారి పర్యవేక్షణలో..
శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ మందులను వేయనున్నాం. పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా మందులు సరిపడా అందుబాటులో ఉన్నాయి. మందులు వేసే సమయంలో విద్యార్థులు అందుబాటులో ఉండాలి.
– డాక్టర్ మల్లికార్జునరావు,
జిల్లా వైద్యాధికారి
సంవత్సరం
1 – 5
6–19
నులితో పిల్లల్లో రక్తహీనత
అనారోగ్య సమస్యలు
రేపటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
18న మాప్ డే
నులిపురుగుల నివారణ ఎంతో అవసరం
– కలెక్టర్ రిజ్వాన్ బాషా
పిల్లల ఆరోగ్యవంతమైన జీవితంలో నులిపురుగు ల నివారణ ఎంతో అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం (డీటీఎఫ్)లో 11న జరిగే నులిపురుగుల నివారణ దినోత్సవంపై మాట్లాడారు. 11వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేయనున్నామన్నారు. ఆ రోజు వీలు కాని వారికి 18న మాప్డేను పురస్కరించుకుని వేస్తామన్నారు. ఇందులో మహిళా శిశు సంక్షేమ, విద్య, ఇతర శాఖలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని పిలుపుని చ్చారు. గోలీలు ఎలా వేయాలనే దానిపై హెల్త్ సెంటర్ స్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతీ పిల్లవాడికి మందులు ఇచ్చేలా చూడాలన్నారు.
నులి పురుగులను నిర్మూలిద్దాం
నులి పురుగులను నిర్మూలిద్దాం