ఎమ్మెల్యే రాజయ్యను సస్పెండ్‌ చేయాలి | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజయ్యను సస్పెండ్‌ చేయాలి

Published Fri, Jun 23 2023 1:36 AM

- - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎన్నికల ముందు ప్రజలకు పలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించిన సీఎం కేసీఆర్‌.. చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు, మహిళపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రాజయ్యను తక్షణమే సస్పెండ్‌ చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సింగపురం ఇందిర డిమాండ్‌ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాల దగా’ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్‌ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

స్థానిక బస్టాండ్‌ సమీపాన అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఇందిర మాట్లాడుతూ.. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం తదితర హామీలు ఏమయ్యాయ ని ప్రశ్నించిన ఆమె.. పదేళ్ల పాలనలో రాష్ట్రంలో అవి నీతి పెరిగిపోయిందని అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై తహసీల్దార్‌ పూల్‌సింగ్‌ చౌహాన్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లకావత్‌ ధన్వంతి, పార్టీ నాయకులు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, కీసర దిలీప్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, చింత ఎల్లయ్య, సింగపురం వెంకటయ్య, ఐలపాక శ్రీను, కోరుకొప్పుల మహేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement