హంగామా!
స్వతంత్రులదే
ఏకశిల బీఈడీ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ..
జనగామ: జనగామ పురపోరులో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నువ్వా,నేనా అన్నట్టుగా తలపడగా, ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితి నెలకొంది. మొత్తం 30 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సీపీఎం 1, స్వతంత్రులు నలుగురు విజయం సాధించారు. చైర్మన్ పీఠం సాధించేందుకు 16 స్థా నాలు అవసరమైన నేపథ్యంలో రెండు ప్రధాన పా ర్టీలకు స్వతంత్రుల మద్దతు తప్పనిసరి అయ్యింది.
కౌంటింగ్ సెంటర్ వద్దే రాజకీయాలు
పట్టణంలోని ఏకశిల బీఈడీ కళాశాలలో శుక్రవారం ఉదయం పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాగా, 10 గంటలకు తొలి ఫలితం విడుదల అయింది. 30 వార్డుల ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల వరకు తేలిపోయాయి. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల, కౌంటింగ్ ఏజెంట్లతో పాటు అభ్యర్థులు, ప్రతిపాదికులు కంటిరెప్ప వాల్చకుండా ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డుల వారీగా ఎలక్షన్ అధికారులు విజేతలను ప్రకటించగా, విక్టరీ చూపిస్తూ అభ్యర్థులు, అనుచర వర్గం ఉరికించే ఉత్సాహంతో బయటకు రాగా, ఓటమి చెందిన వారు మాత్రం తీవ్ర నిరాశతో వెళ్లిపోయారు.మొత్తంగా 48 పోస్టల్ ఓట్లు పోలు కాగా, నోటాకు 119, రిజెక్ట్ అయిన ఓట్లు 259 ఉండగా మొత్తంగా 478 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
స్వతంత్రుల కోసం..
8వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి సందుపట్ల మంజుల, 15వ వార్డు నుంచి విజయం సాధించిన మారబోయిన పాండు, 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థి భూష పర్వతాలు, 5వ వార్డులో గెలిచిన ఇండింపెండెంట్ మిద్దెపాక భాస్కర్ చైర్మన్ రేసులో కీలకంగా మారారు. భూష పర్వతాలను తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా, యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్క్వార్టర్ హైవేపై ఉన్న ఓ హోటల్లో హైడ్రామా చోటుచేసుకున్నట్లు సమాచారం. పర్వతాలు బీఆర్ఎస్ వైపు వెళ్లాలని మొండికేయడంతో పాటు కాంగ్రెస్ నాయకుల నుంచి తప్పించుకుని గులాబీ శ్రేణులు వద్దకు చేరుకోగా, ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. మంజుల సైతం బీఆర్ఎస్ గూటికి చేరినట్లు తెలుస్తుండగా, భాస్కర్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. అత్యంత కీలక స్థానంలో ఉన్న మారబోయిన పాండు మాత్రం రెండు పార్టీల మధ్య చర్చలు సాగించడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన్ను తీసుకెళ్లేందుకు రెండు పార్టీలు కార్లు సిద్ధం చేయగా, చివరకు తన సన్నిహితుడి కారులో ఇంటికి వెళ్లిపోయారు. పట్టణంలో ఈ నలుగురు స్వతంత్రులకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఆఫర్లు చేసినట్లు చర్చ నడుస్తోంది. తనకు చైర్మన్ పీఠం ఇస్తే ఆ పార్టీకే మద్దతు ఇస్తానని పాండు మీడియాకు వెల్లడించగా, మిగతా ముగ్గురు కూడా తన మాట వింటారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎవరు చైర్మన్ పీఠం ఎక్కినా...వైస్ చైర్మన్ పదవి మాత్రం స్వతంత్రుల్లో ఒక్కరికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి 23వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన భూష పర్వతాలకు వైస్ చైర్మన్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
చైర్మన్ రేసులో పోటీదారులు
కాంగ్రెస్ తరఫున 22వ వార్డు నుంచి కడకంచి బాలమణి, బీఆర్ఎస్ నుంచి 29వ వార్డు ముస్తాల మౌనిక దయాకర్, 18వ వార్డు గోపగోని సుగుణాకర్ గౌడ్ బరిలో ఉన్నారు. రెండు పార్టీలు ఎక్స్అఫీషియో ఓట్లతో కూడి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలనే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.
కలెక్టర్ పర్యవేక్షణలో..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, మునిసిపల్ కమిషనర్లు మహేశ్వర్రెడ్డి, రాధాకృష్ణ, డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల కంటిమీద కునుకు లేకుండా బందోబస్తు నిర్వహణ చేపట్టారు. కాగా, ప్రజలు తేల్చుకోలేని తీర్పు ఇవ్వడంతో స్వతంత్రులే గేమ్ఛేంజర్లుగా మారి చైర్మన్ పీఠం ఎటు తిరుగుతుందనే ఆసక్తి జిల్లాలో రాజకీయ హీట్ పెంచుతోంది. ‘ఇండింపెండెంట్లే గేమ్ఛేంజర్లు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనం నిజం కావడం గమనార్హం.
వారు మద్దతు ఇచ్చినవారికే జనగామ పుర‘పీఠం’
కాంగ్రెస్–12, బీఆర్ఎస్–13, సీపీఎం–1, స్వతంత్రులు–4
బీఆర్ఎస్ కోటలో ఇద్దరు.. కాంగ్రెస్ పక్కన ఒక్కరు
రెండు పార్టీలకు టచ్లో మరో అభ్యర్థి..
స్వతంత్ర విజేత కోసం భువనగిరి హోటల్ వద్ద హైడ్రామా
స్వతంత్రులకు లక్షల్లో ఆఫర్..!
ఓట్ల శాతంలో బీఆర్ఎస్దే పైచేయి
జనగామ,స్టేషన్ ఘన్పూర్లో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
హంగామా!
హంగామా!
హంగామా!
హంగామా!
హంగామా!


