రాయికల్: బీసీలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించే పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారులకు మిషన్లు అందించేందుకు ఈనెల 15వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. దీనికి కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు అవసరం కాగా.. ఆయా దరఖాస్తులు ఎక్కువగా తిరస్కరణకు గురికావడంతో మహిళలను ఆందోళనకు గురిచేస్తోంది.
ధ్రువీకరణ పత్రాల్లో జాప్యం
ప్రస్తుతం ఆదర్శ వివాహాలు పెరిగిన నేపథ్యంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళలు పుట్టింటి నుంచే ధ్రువీకరణ పత్రాలను ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో తీసుకోవాలని రెవెన్యూ అధికారులు అంటున్నారు. పుట్టింటి పత్రాన్ని జతచేసి దరఖాస్తు చేసుకుంటే అత్తింటి పేరుతో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని మరికొంత మంది సూచిస్తుండడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఆధార్నంబర్లో అత్తింటి వారి వివరాలు ఉన్నవారే మండలంలో దరఖాస్తు చేసుకోవాలని అక్కడి అధికారులు చెబుతున్నట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


