జిల్లాలో కొత్తగా 10 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం రూ.20 కోట్లకుపైగా వ్యయంతో ముమ్మరంగా పనులు
జగిత్యాలరూరల్: జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరగడమే కాకుండా వ్యవసాయ వాడకం సైతం అధికమైంది. వీటికి తోడు చిన్న, పెద్ద పరిశ్రమలు పుట్టుకొస్తుండటంతో విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగిపోయి నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి సబ్స్టేషన్ల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి విద్యుత్ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఇప్పటికే 33/11 కేవీ సబ్స్టేషన్లు 118 ఉండగా అదనంగా మరో 10 సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోంది. ఇవేకాక 132/33, 220/132 సబ్ స్టేషన్లు నిర్మించాలన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో సబ్స్టేషన్లు
జగిత్యాల జిల్లాలో 10 సబ్స్టేషన్లు మంజూరు కాగా ఏడు సబ్స్టేషన్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. మరో మూడు సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కథలాపూర్ మండలం పోసానిపేట, కోరుట్ల మండలం సిరికొండ, మెట్పల్లి మండలం రేగుంట, మేడిపల్లి మండలం పోరుమల్ల, బీమారం, ధర్మపురి మండలం తిమ్మాపూర్, గొల్లపల్లి మండలం వెన్గుమట్ల, కొడిమ్యాల మండలం గౌరాపూర్, కోనాపూర్ గ్రామాల్లో రూ.20 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయితే లోవోల్టేజీ సమస్య తీరడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగుతుంది.
వేగవంతంగా పనులు
జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. అందుకు అనుగుణంగా భవిష్యత్లో సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్ధంగా సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం పనులు నాణ్యతగా, వేగవంతంగా చేయిస్తున్నాం.
–సుదర్శన్, ట్రాన్స్కో ఎస్ఈ


