● పెద్దపల్లి జంక్షన్లో బిహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ నుంచి చర్లపల్లి నుంచి ముజఫర్పూర్ వరకు నడుస్తున్న 15294/93 అమృత్భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు ఇప్పటికే స్టాప్ ఉంది. ఇది వయా జబల్పూర్ – ప్రయాగరాజ్ – పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ – పాట్నా మీదుగా నడుస్తుంది.
● గతంలో పెద్దపల్లి జంక్షన్లో ఆగి రద్దైన 03679/80 ధన్బాద్ నుంచి కోయంబత్తూరు నుంచి ధన్బాద్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ తాజాగా అమృత్ భారత్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుగా తూర్పుమధ్య రైల్వే అధికారులు క్రమబద్ధీకరించారు. ప్రస్తుతం ఈ రైలు సంఖ్య 22363/64. త్వరలో క్రమబద్ధీకరించిన ఈ రైలును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు వయా నేతాజీగొమోహ్ – గయా – పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ – ప్రయాగరాజ్ – జబల్పూర్ – ఇటార్సీ – నాగపూర్ – వరంగల్ – విజయవాడ – రేణిగుంట – తిరుత్తణి – కాట్పాడి – ఈరోడ్ మీదుగా నడుస్తుంది. ఈ రైలు పెద్దపల్లి జంక్షన్కు కోయంబత్తూరు వైపు వెళ్లేటప్పుడు ప్రతి ఆదివారం రాత్రి 11: 10 గంటలకు రానుంది. ధన్బాద్ వైపు వెళ్లేటప్పుడు పెద్దపల్లి జంక్షన్కు ప్రతి బుధవారం ఉదయం 03:55 గంటలకు వస్తుంది. ఈ రైలుతో గయా, వారణాసి, ప్రయాగరాజ్, తిరుపతి, తిరుత్తణి, పలని వెళ్లే భక్తులతోపాటు తిరుప్పుర్, ఈరోడ్, సేలం వెళ్లే వస్త్రవ్యాపారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
● ప్రస్తుతం హైదరాబాద్ – గోరఖ్పూర్ – హైదరాబాద్ మధ్య నడుస్తున్న 07075/76 వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా ఉన్నతీకరించడంతో పాటు క్రమబద్ధీకరించారు. అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా ఉన్నతీకరించి, క్రమబద్ధీకరించిన తరువాత ఈ రైలు సంఖ్య 22075/76. ఈ రైలు గోరఖ్పూర్ వైపు వెళ్లేటప్పుడు పెద్దపల్లి జంక్షన్కు ప్రతి శనివారం రాత్రి 12:20 గంటలకు చేరుకుంటుంది. చర్లపల్లి వైపు వెళ్లేటప్పుడు ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది.
● అమృత్ భారత్ రైళ్లహాల్ట్లకు కేంద్రంగా పెద్దపల్లి జంక్షన్ మారింది. ఇప్పటికే ఒక అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్తో పాటు తాజాగా ఉన్నతీకరించి, క్రమబద్ధీకరించిన మరో రెండు అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పెద్దపల్లిలో మొత్తంగా 3 అమృత్ భారత్ రైళ్లకు హాల్టింగ్ దొరికింది.
● ప్రస్తుతం బల్లార్షా నుంచి వరంగల్ మధ్య కేవలం మంచిర్యాల రైల్వేస్టేషన్లో స్టాప్ కలిగిన 16602/01 జోగ్బాని నుంచి ఈరోడ్ నుంచి జోగ్బాని అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ ప్రెస్రైలుకు కూడా పెద్దపల్లి జంక్షన్లో స్టాప్ ఇస్తే నేపాల్ వెళ్లే ప్రయాణికులతోపాటు భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దపల్లిలో మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లకు హాల్టింగ్ ఉత్తరాది కార్మికుల కోసం పెద్దసంఖ్యలో సాధారణ బోగీలు బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వెళ్లేవారికి ఉపయోగకరం ప్రయాగ్రాజ్, కాశీ, గయా భక్తులకు అనుకూలం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వలస జీవులకు కేంద్ర రైల్వేశాఖ తీపి కబురు తీసుకొచ్చింది. సామాన్య, మధ్య తరగతి వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అత్యధికంగా సాధారణ బోగీలు ఉండేలా అమృత్ భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి జంక్షన్లో రెండు నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి జంక్షన్ మీదుగా ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే వలసకార్మికులు దాణాపూర్, రక్సల్ వంటి రైళ్లలో ప్రమాదకర స్థితుల్లో ప్రయాణం చేస్తున్నారు. వీటిలో కేవలం నాలుగు సాధారణ బోగీలు ఉండడంతో అందులోనే కిక్కిరిసి ఒక రోజంతా ప్రయాణం చేస్తున్నారు.