సర్వేతో సరి.. పరిహారం ఊసేది..?
వానాకాలం సీజన్లో భారీ వర్షాలు జిల్లావ్యాప్తంగా వరి పంటకు తీవ్ర నష్టం ఎకరాన రూ.10వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పరిహారం కోసం నాలుగు నెలలుగా నిరీక్షిస్తున్న రైతులు
కథలాపూర్: వానకాలం సీజన్లో అష్టకష్టాలు పడి వరి పంట సాగు చేయగా.. భారీ వర్షంతో చేతికందే దశలో తీవ్ర నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు అప్పట్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి బాధిత రైతుల వివరాలు సేకరించారు. నాలుగు నెలలు దాటినా ఇప్పటివరకు పరిహారం రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెబుతున్న పాలకులు.. పరిహారం మంజూరు గురించి పట్టించుకో వడం లేదని బాధిత రైతులు మండిపడుతున్నారు.
అక్టోబర్లో భారీ వర్షాలు
జిల్లాలోని ఆయా గ్రామాల రైతులు వానకాలం సీజ న్లో మూడు లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. అక్టోబర్లో వరి పంట ఎదిగి చేతికొచ్చే సమయంలో భారీ వర్షం కురిసింది. వరి పంట నేలవాలగా.. వరి గింజలు రాలిపోయాయి. చేతికందే సమయంలో భారీ వర్షం తమకు నష్టం చేసిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. దిగుబడి రాకపోక.. పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి ఏర్పడిందని లబోదిబోమన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు సుమారు 20వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ఎకరానికి రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇప్పటికీ పరిహారం దిక్కులేదని మండిపడుతున్నారు. మరోవైపు అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వరి పంట వివరాలు మాత్రమే సేకరించారు. ఆ తర్వాత పట్టించుకోలేదని జిల్లాలోని ఆయా మండలాల రైతులు ఆరోపిస్తున్నారు. అక్టోబర్ చివరి వారం, నవంబర్ నెలలో కురిసిన వర్షాల ఆధారంగా నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తే బాగుండేదని అంటున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొర వ చూపి భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరి హారం ఇప్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.


