మైకుల హోరు.. ప్రచార జోరు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగడంతో ప్రతీ వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నాయకులే కనబడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అవ్వ, అక్క, అన్న.. ఒకసారి అవకాశం ఇవ్వండి.. అంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. ఏ సమస్య ఉన్నా మీ ముందు వెంటనే వాలుతానని, పనిచేస్తానని, అభివృద్ధి చేసి చూపిస్తానని భరోసా కల్పిస్తున్నారు. ఉదయం ఓటర్లు లేవకముందే ఇంటి ఎదుట ప్రత్యక్షమవుతున్నారు. కొందరు అభ్యర్థులైతే భార్యభర్తలు ఇద్దరే వచ్చి ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ ఇంటింటికీ తిరుగుతూ మద్దతిచ్చి గెలిపించాలని కోరుతున్నారు. ఉదయం భార్యభర్తలు ఇద్దరు తిరుగుతూ మళ్లీ మధ్యాహ్నం 11 గంటల సమయంలో తమ మద్దతుదారులతో కాలనీలంతా తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు సైతం వార్డువార్డునా తిరుగుతూ మా అభ్యర్థికే ఓటు వేయాలని వేడుకోవడంతో అసలైన ప్రచార పర్వం మొదలైంది. సమయం ఎక్కువ లేకపోవడంతో అభ్యర్థులు ప్రతీ ఒక్క ఓటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల వార్డుల్లో కౌన్సిలర్గా అవకాశం ఇవ్వండి అంటూ మైకులతో హోరెత్తిస్తున్నారు. వారి అనుచరులు ఓటర్లు ఎక్కడున్నా వెళ్లి స్వయంగా కలుస్తున్నారు. వివిధ కాలనీలకు చెందిన వారు వారి పని నిమిత్తం ఉదయం ఎక్కడకు వెళ్లినా అక్కడికే వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
అవకాశాన్ని మలుచుకునేలా ప్రయత్నాలు
వారి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు ముదరడంతో టికెట్ల పంపిణీలో సైతం వారి వర్గీయులకు రాకపోవడంతో ఎమ్మెల్యే, మాజీమంత్రి ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, దీనిని అవకాశంగా తీసుకోవాలని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగ శ్రావణి సైతం వార్డుల్లో ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
అభ్యర్థుల సందడి
ప్రచార జోరు ఊపందుకోవడంతో మున్సిపాలిటీల్లో ప్రధాన వీధులు, బస్టాండ్లు, వివిధపార్టీల నాయకులతో కళకళలాడుతున్నాయి. అటు హోటళ్లలో సైతం గిరాకీ పెరిగింది. ఈసారి మహిళలు ఎక్కువ ప్రచారం చేపడుతున్నారు. రాత్రే ప్రణాళికలు రూపొందించుకుని పోల్ మేనేజ్మెంట్ ప్రకారం ప్రచారం చేపడుతున్నారు.
ప్రలోబాలకు ఎర
అప్పుడే ప్రతీ వార్డుల్లో ఓ టర్లను ఆకట్టుకునేందు కు ప్రలోభాలకు ఎరచూపుతున్నట్లు తెలిసింది. వార్డుల్లో ఏది కావాలన్నా వెంటనే చేపిస్తామని, వీధిదీపాలు, డ్రెయినేజీ సమస్యలు గానీ, ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకువస్తే వెంటనే చేపిస్తామని హామీ ఇస్తున్నారు.
అటు జీవన్.. ఇటు సంజయ్..
జగిత్యాల మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన ప్రధాన నాయకులైన అటు జీవన్రెడ్డి... ఇటు సంజయ్కుమార్ వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. జీవన్రెడ్డికి కాంగ్రెస్ నుంచి 15 టికెట్లే దక్కడంతో ఆ 15 వార్డుల్లో కాంగ్రెస్కు ప్రచారం చేస్తుండగా.. మిగతా వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండగా వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ సైతం ప్రభుత్వానికి మద్దతిస్తున్న వారికి ఓటు వేయాలంటూ పేర్కొంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా అటు జీవన్, ఇటు సంజయ్లు ఒకే పార్టీకి చెందిన ప్రచారం నిర్వహించడం, ఆయన వర్గీయులను గెలిపించుకోవాలని అతను, ఇతని వర్గాన్ని గెలిపించుకోవాలని ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మైకుల హోరు.. ప్రచార జోరు
మైకుల హోరు.. ప్రచార జోరు
మైకుల హోరు.. ప్రచార జోరు


