నిర్వహణ భారం!
● మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు ● ఇబ్బంది పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు
జగిత్యాలరూరల్: వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు భారంగా మారాయి. రైతులకు ఆధునిక సాగు విధానంపై సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన వీటి నిర్వహణపై పట్టింపు లేకుండా పోయింది. ఏళ్ల తరబడి ని ధులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన ల క్ష్యం మేరకు ముందుకు సాగడం లేదు. మూడేళ్లకు పైగా బకాయిలు పేరుకపోవడంతో ఏఈవోలకు భారంగా మారింది.
ఏళ్ల తరబడి..
జిల్లాలో క్లస్టర్ల వారీగా 71 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 వరకు ఐదునెలల పాటు నెలకు రూ.8వేల చొప్పున గత ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. మే 2022 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణాధికారులు నెలనెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతు వేదికకు ప్రతినెలా నిర్వహణ చేయడం వారికి కష్టతరంగా మారింది.
అన్నింటి భారం ఏఈఓల పైనే..
రైతువేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు సమావేశమై సాగు సమస్యలు, ఆధునిక పద్ధతులపై చర్చించేందుకు వీలుగా రైతువేదికల్లో గతేడాది వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. కనీసం మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, కరెంటు బిల్లుల చెల్లింపు, స్వీపర్లకు జీతాల చెల్లింపు, రైతునేస్తం, రైతులతో సమావేశాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు వంటివాటికి నిధులు లేకపోవడంతో అన్నింటిని తామే భరించాల్సి వస్తుందని ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతువేదికల్లో అటెండర్ మొదలుకొని అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు రైతువేదికల్లో ఏర్పాటుచేసిన మినీ భూసార పరీక్షల నిర్వహణ కూడా అటకెక్కింది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయానికి రైతువేదికలను సిద్ధం చేయాలని అటెండర్ కూడా లేకపోవడంతో అన్ని పనులు తామే చేయాల్సి వస్తుందని అంటున్నారు. పైగా ప్రతినెలా తమ వేతనం నుంచే నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోందని ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.


