చేయని నేరానికి దళిత యువకుడిని బలి చేస్తారా?
బుగ్గారం(ధర్మపురి): స్థానిక ఉన్నత పాఠశాలలో గతంలో చెట్లు నరికిన ఘటనలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అమాయక దళిత యువకుడిని కేసులో ఇరికించారని బుగ్గారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు, వీడీసీ కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి హాజరై మాట్లాడారు.
గతేడాది నవంబర్లో స్థానిక జెడ్పీహెచ్ఎస్ మైదానంలో 6 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండానే ఎస్ఎంసీ చైర్మన్ మూల శ్రీనివాస్గౌడ్ నరికించి, మాయం చేశారన్నారు. దీనిపై వీడీసీ ఆధ్వర్యంలో తాను అధికారులకు ఫిర్యాదు చేయగా గ్రామపంచాయతీ కార్మికుడు దూడ కిరణ్ను ఇందులో ఇరికించి, చైర్మన్ తప్పించుకున్నారని పేర్కొన్నారు. చేయని నేరానికి దళిత యువకుడిని బలి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త శ్రీనివాస్గౌడ్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడీసీ అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.