సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కారు డ్రైవింగ్ చేయడంతో.. ఆ వాహనం బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడిని జగిత్యాలకు చెందిన అరుణ్గా గుర్తించారు.
వివరాల మేరకు.. జగిత్యాలకు చెందిన నివేష్, అశ్విన్, అరుణ్.. థార్ వాహనంలో బయటకు వెళ్లారు. వీరు ముగ్గురు వాహనంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ వాహనంలో వెళ్తుండగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి వద్ద ప్రమాదం జరిగింది. థార్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం డ్రైవింగ్ చేస్తున్న అరుణ్ బావిలో గల్లంతు కాగా.. అతి కష్టం మీద నివేష్, అశ్విన్ ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే, వాహనం బావిలో పడిన తర్వాత భారీ శబ్దం రావడంతో.. గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. గల్లంతైన అరుణ్ కోసం రెండు గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. అనంతరం, కారుతో పాటు చిక్కుకుపోయిన అరుణ్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం బయటకు తీసింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది.



