భారతదేశం, అమెరికా మధ్య వైద్య ఖర్చుల్లో తేడాలపై గతంలో అనేక కథనాలు చూశాం. తాజాగా ఒక అమెరికన్ మహిళ మరో ఇంట్రస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశారు. ఇండియా, యూఎస్లోని వైద్య ధరల మధ్య భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలో తమని దోచుకుంటున్నారంటూ ఆమె పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో విశేషాలు
'లిజ్' అనే అమెరికన్ మహిళ "ఇండియన్ వర్సెస్ అమెరికన్ హెల్త్కేర్" అనే టైటిల్తో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అమెరికాతో పోలిస్తే భారతదేశంలో వైద్య ఖర్చులు చాలా తక్కువని, అమెరికాలో ప్రజలను 'దోచుకుంటున్నారని' ఆరోపించింది. ఇందుకు 'రెవ్లిమిడ్' (Revlimid) అనే టాబ్లెట్ ధరను ఆమె ఉదాహరణగా చూపింది.
తన అత్తగారి బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు వాడే టాబ్లెట్ ధర అమెరికా డాలర్లు 900 (సుమారు రూ. 85,000) ఉండగా, భారతదేశంలో దీని జెనరిక్ ప్రత్యామ్నాయం కేవలం 30 సెంట్ల నుండి 3 డాలర్ల (రూ. 35 నుండి రూ. 300) లోపే లభిస్తోందని వెల్లడించింది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 8 లక్షల వ్యూస్ వచ్చాయి. భారతదేశంలోని చౌకైన వైద్య విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అలాగే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత క్యాన్సర్ చికిత్స కూడా అందుబాటులో ఉందని ఒక యూజర్ పేర్కొనగా, అమెరికన్లు భారత్కు వచ్చి మందులు కొనుగోలు చేసినా ప్రయాణ ఖర్చులు పోను డబ్బులు మిగులు తాయని మరొకరు కామెంట్ చేశారు.
ఇదీ చదవండి: కేతన్ హత్య : కోడ్వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’
గత నెలలో 'విక్టోరియా' అనే మరో అమెరికన్ మహిళ కూడా యూఎస్ హెల్త్కేర్ సిస్టమ్ను ఒక "స్కామ్" అని అభివర్ణించింది. అమెరికాలో ఆమెకు అత్యవసరమైన మందును ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయకపోవడంతో, అక్కడ వెయ్య డాలర్లు పలికే ఆ మందును, ఇండియాలోని తయారీదారు నుండి నేరుగా కేవలం 25 డాలర్లకే కొనుగోలు చేయగలిగింది. అమెరికాలో సామాన్య ప్రజలను పూర్తిగా మోసం చేస్తున్నారని, ఇంత భారీ మొత్తంలో అదనపు డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!


