కాబూల్: మహిళలపై తాలిబన్ల ఆంక్షలు ఎంతమాత్రమూ ఆగడం లేదు. పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు వివాహ విషయమై మౌనంగా ఉంటే పెళ్లికి అంగీకరించినట్లు భావించాలని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది వరకే ఆరో తరగతి తరవాత బాలికలకు చదువుకోవడం నిషేదించిన తాలిబన్లు ఇప్పుడు మరో కఠిన చట్టం అమలులోకి తెచ్చారు.
తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే 31 నిబంధనల జీవోలో ఈ విషయాలను పొందుపరిచారు. అందులో వివాహ దశకు వచ్చిన అమ్మాయి తన వివాహ విషయమై మౌనంగా ఉంటే, దానిని వివాహానికి ఆమె అంగీకరించినట్లుగానే పరిగణించవచ్చని చట్టాన్ని తీసుకవచ్చారు. బాల్య వివాహాలపై హక్కులు పూర్తిగా తండ్రులు, తాతలకు ఇవ్వబడినట్లు పేర్కొన్నారు. బాల్యంలో జరిగిన వివాహాలను బాలికలు రజస్వల అయిన తర్వాత రద్దు చేసుకోవచ్చని దానికి తాలిబాన్ కోర్టు ఆమెదం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
అయితే అఫ్గానిస్థాన్ లో బాలికలపై జరుగుతున్న ఆగడాలపై వచ్చిన నివేదికలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక సహాయం కోసం పసిపిల్లలను పెళ్లి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపాయి. బ్రిటిష్ వార్తా సంస్థ 'జిబి న్యూస్'నివేదికల ప్రకారం భార్య శరీరంపై గాయాలు కనిపించనంత వరకు భర్తలు వారిని శారీరకంగా శిక్షించవచ్చు.
మహిళలపై కఠిన చట్టాలు
కాగా తాలిబన్లు ఇదివరకే మహిళలపై పలు కఠినచట్టాలు అమలులోకి తెచ్చారు.
బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించారు.
యూనివర్సిటీల బంద్: మహిళలు ఉన్నత విద్య (యూనివర్సిటీలు) అభ్యసించకుండా పూర్తిగా నిషేధం విధించారు. దీనివల్ల ఆ దేశంలో మహిళా డాక్టర్లు, టీచర్లు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది.
మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడాన్ని నిలిపివేశారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య రంగ సిబ్బందికి మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.
మహిళలు ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయకూడదని మగవారి తోడు తప్పనిసరని పేర్కొన్నారు.
మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం నిలిపివేశారు.
పార్కులు, జిమ్లు, బ్యూటీ పార్లర్లు, వినోద ప్రదేశాలకు మహిళలు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు.
మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల నుండి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసేలా హిజాబ్ లేదా బురఖా ధరించడం తప్పనిసరి చేశారు


