తైవాన్‌ ప్రజలకు భారత నెటిజన్ల విషెస్‌! | Taiwan President Says Ready For Meaningful Dialogue With China | Sakshi
Sakshi News home page

చైనాతో చర్చలకు సిద్ధం.. కానీ: తైవాన్‌

Oct 10 2020 2:44 PM | Updated on Oct 10 2020 5:20 PM

Taiwan President Says Ready For Meaningful Dialogue With China - Sakshi

తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని తైవాన్‌ అధ్యక్షురాలు స్పష్టం చేశారు.

తైపీ/బీజింగ్‌: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌- వెన్‌ ప్రకటించారు. దక్షిణ చైనా సముద్ర జలాలు, హాంకాంగ్‌ విషయంలో డ్రాగన్‌ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు, భారత్‌- చైనా బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు వంటి అతిపెద్ద సవాళ్లను చైనా ఎదుర్కొంటోందన్న ఆమె, తమతో శాంతి చర్చల ద్వారా మెయిన్‌లాండ్‌లోని సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని సూచించారు. యుద్ధ వాతావరణాన్ని తొలగించే దిశగా డ్రాగన్‌ అడుగులు వేస్తే, తాము ఇందుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. (చదవండి: తైవాన్‌ ప్రకటన; చైనాకు భారత్‌ గట్టి కౌంటర్‌)

అయితే అదే సమయంలో, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా శనివారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన త్సాయి ఈ మేరకు మీడియా ముఖంగా చైనాకు తమ వైఖరిని తెలియజేశారు. అదే విధంగా కరోనాను కట్టడి చేయడంలో తాము సఫలమయ్యామని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు తనవంతు కృషి​ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా 2016లో తొలిసారిగా అధికారం చేపట్టిన నాటి నుంచి చైనాతో చర్చలకు త్సాయి, పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ డ్రాగన్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తైవాన్‌ తమలో అంతర్భాగమేనని చైనా పునరుద్ఘాటిస్తోంది. అదే విధంగా తమకు వ్యతిరేకంగా తైవాన్‌కు మద్దతు తెలుపుతున్న అమెరికా సహా యూరప్‌ దేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.(యుద్ధం మొదలవుతుంది: చైనా హెచ్చరిక)

భారత నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు
నేషనల్‌ డే సందర్బంగా భారత నెటిజన్ల నుంచి తైవాన్‌ పౌరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు, జర్నలిస్టులు త్సాయి ఇంగ్‌ వెన్‌, తైవాన్‌ ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాటి టాప్‌ ట్రెండ్స్‌లో #TaiwanNationalDay ఒకటిగా నిలిచింది. ఈ విషయంపై స్పందించిన జర్నలిస్టు అభిజిత్‌ ముజుందార్‌.. ‘‘అద్భుతం.. #TaiwanNationalDayఇండియాలో ట్రెండింగ్‌లో ఉంది. చైనా ఇప్పటికీ తైవాన్‌ పట్ల అలాగే వ్యవహరిస్తే మిత్ర దేశాలకు దూరం కావాల్సి వస్తుంది’’ అని హాంకాంగ్, తైవాన్‌, టిబెట్‌ వైఖరిపై చైనా తీరును ఎండగట్టారు. ఇక మరికొంత మంది త్వరలోనే ప్రపంచ దేశాలన్నీ తైవాన్‌కు మద్దతు ప్రకటించి, అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంటాయని అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement