కైరో: సూడాన్లో ఆర్మీ, పారా మిలటరీ(ఆర్ఎస్ఎఫ్) మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న ఆధిపత్య పోరులో సామాన్యులు సమిధలవుతున్నారు. బుధవారం రాత్రి ఎల్ ఒబెయిద్ నగరంలోని వివిధ ప్రాంతాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల మంది గాయాలపాలయ్యారు.
అక్కడి సైనిక స్థావరంతోపాటు ఆహార పదార్థాలతో వస్తున్న ట్రక్కుపైన, గ్యాస్ స్టేషన్ వద్ద శ్మశాన వాటిక వద్ద చేరిన జనంపైనా దాడులు జరిగాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎల్ ఒబెయిద్ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. నగరంపై డ్రోన్ సంచరిస్తూనే ఉన్నాయన్నారు. దాడుల భయంతో స్కూళ్లు మూసివేశారని, మార్కెట్లను పాక్షికంగా మాత్రమే తెరుస్తున్నారన్నారు. మూడేళ్లలో కనీసం 60 వేల మంది చనిపోగా, 1.30కోట్ల మంది నిరాశ్రయులుగా మారినట్లు ఐరాస అంచనా.


