సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించడం తప్పనిసరన్నారు. ఈ అంశంలో భారత్తో కలిసి పనిచేయడానికి సౌత్ కొరియా సిద్ధంగా ఉందని తెలిపారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న (ఆదివారం) భారత్కు విచ్చేశారు. ఈ సందర్బంగా న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ అభివృద్ధి చెందుతున్న దేశాలైన సౌత్ కొరియా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దిగుమతుల విషయంలో ఏ ఒక్క దేశంపైనా పూర్తిస్థాయిలో ఆధారపడకూడదని అది దేశ మనుగడకే ప్రశ్నార్థకమవుతుందన్నారు.
హర్ముజ్ జలసంధిపై మాట్లాడుతూ.. "రిపబ్లిక్ ఆఫ్ కొరియా, భారత్ రెండూ దేశాలు ముడి చమురు,సహజ వాయువుతో సహా తమ ఇంధన సరఫరాలలో మెజారిటీ వాటా కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల, మన ప్రజల భద్రతకు మరియు మన దేశాల మనుగడకే కీలకమైన సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం అత్యవసరం. హర్ముజ్ జలసంధిలో అన్ని నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు కొరియా, భారత్తో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఈ ఉమ్మడి నిబద్ధతను నిలబెట్టుకోవడానికి సంబంధిత అంతర్జాతీయ వేదికలలో కూడా మేమిద్దరం కలిసి పనిచేయడం కొనసాగిస్తాము". అని అన్నారు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాలు చమురుకోసం మరో మార్గాన్ని ఎంచుకోవడం కూడా అవసరం అని ఆయన అన్నారు. ఇటీవల హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాగా ఈ రోజు (సోమవారం)ష్ట్రపతి భవన్లో లీ -జే-మ్యూంగ్కు అధికారికంగా సైనిక వందనంతో స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.


