గాజాలో హమాస్‌కు బిగ్‌ షాక్‌.. | Palestinians Hamas Out Slogans In Gaza Streets | Sakshi
Sakshi News home page

గాజాలో హమాస్‌కు బిగ్‌ షాక్‌..

Mar 26 2025 11:01 AM | Updated on Mar 26 2025 11:30 AM

Palestinians Hamas Out Slogans In Gaza Streets

ఇజ్రాయెల్‌-హమాస్‌ పరస్పర దాడులు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో పాలస్తీనియన్లు నిరసనలు తెలుపుతూ భారీ సంఖ్యలో రోడ్లకు మీదకు వచ్చారు. యుద్ధం ఆపాలంటూ నినాదాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

గాజాలో హమాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్‌ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్‌ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. దీనికి సంబంధిచిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే, హమాస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు ఎవరు నేతృత్వం వహించారు అనేది తెలియరాలేదు. టెలిగ్రామ్‌లో వచ్చిన సందేశాల ఆధారంగానే తాము ఆందోళనల్లో పాల్గొన్నామని నిరసనకారుల్లో కొందరు తెలిపారు. ఇదిలా ఉండగా.. 2007 నుంచి గాజాను హమాస్ పాలిస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడుల కారణంగా యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 17 నెలల నుంచి ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య యుద్ధం సాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు చేసిన దాడులకు 50 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.

ఈ యుద్ధం ప్రారంభం నుంచి గాజాలో హమాస్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ పొడిగింపును హమాస్ నిరాకరించింది. ఇటీవల కాల్పుల విరమణ ముగిసిన తర్వాత వారం వ్యవధిలోనే మళ్లీ దాడులు మొదలుకాగా.. వీటిలో దాదాపు 673 మంది చనిపోయారు. దీంతో, ఇజ్రాయెల్‌ దాడులను మరింతగా పెంచడంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈనెల మొదట్లో గాజాలోకి మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో అక్కడి పరిస్థితులు మరింత క్షీణించాయి.

Advertisement
 
Advertisement
Advertisement