ఆ మట్టి ఖరీదు రూ.11 లక్షలు | Nasa to Buy Moon Dust For Up To 15000 Dollars | Sakshi
Sakshi News home page

చంద్రుడి మీద మట్టి కొనుగోలు చేయనున్న నాసా

Dec 4 2020 5:33 PM | Updated on Dec 4 2020 5:35 PM

Nasa to Buy Moon Dust For Up To 15000 Dollars - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షానికి సంబంధించిన విషయాలు ఆసక్తిని కలిగించడమే కాక ఖరీదైనవి కూడా. ఎంత విలువైనవి అంటే అక్కడి మట్టే లక్షల విలువ చేస్తుంది. అవును చంద్రుడి మీద మట్టి కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 15 వేల డాలర్లు(11,05,803 రూపాయలు) చెల్లించేందుకు సిద్ధ పడింది. చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే మట్టిని కొనుగోలు చేసేందుకు నాసా నాలుగు ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. రానున్న సంవత్సరాల్లో సదరు కంపెనీలు చంద్రుడి మీద నుంచి మట్టిని సేకరించి నాసాకు అప్పగిస్తాయి. "మేము నాలుగు కంపెనీల నుంచి మొత్తం, 25,001 డాలర్లకు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే వాటిని కొనుగోలు చేయబోతున్నాం" అని నాసా కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ డివిజన్ డైరెక్టర్ ఫిల్ మక్అలిస్టర్న్‌ వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో తెలిపారు. (చదవండి: బోస్‌-ఐన్‌స్టీన్‌లు ఊహించినట్టుగానే అంతరిక్షంలో..)

ఇక ఈ ఒప్పందలో లునార్‌ అవుట్‌పోస్ట్‌ ఆఫ్‌ గోలెడ్న్‌, కొలరాడోతో ఒక్క డాలర్‌కు ఒప్పందం కుదుర్చుకోగా.. టోక్యోకు చెందిన ఇస్పేస్ జపాన్‌తో 5,000 డాలర్లకు.. లక్సెంబర్గ్ ఐస్పేస్ యూరప్‌తో మరో 5,000 డాలర్లకు.. చివరగా కాలిఫోర్నియాలోని మోజావే మాస్టెన్ స్పేస్ సిస్టమ్స్‌తో 15,000 డాలర్లకు నాసా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2022-23 సంవత్సారల్లో ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి మట్టిని తెచ్చి నాసాకు అప్పగిస్తాయి. ఈ కంపెనీలు చంద్రుడి మీద నుంచి తీసుకువచ్చే ఈ మట్టిని ‘రెగోలిత్’‌ అంటారు. మట్టితో పాటు దాని సేకరణ, సేకరించిన పదార్థాలకు సంబంధించిన చిత్రాలను కూడా అందిస్తాయి. ఇక ఈ మట్టిని నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏకైక భాగస్వామిగా వినియోగించనుంది. అయితే ఈ మట్టిని భూమికి తీసుకువస్తారా లేదా అనే దాని గురించి ఎలాంటి స్పష్టత లేదు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా నాసా 2024 నాటికి స్త్రీ, పురుషిలిద్దరిని చంద్రుడి మీదకు పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఫలితాల ఆధారంగా అంగారక గ్రహంపై కాలు మోపాలని భావిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement