Brazil: 10 రోజులుగా ఎక్కిళ్లు.. ఆస్పత్రి పాలైన అధ్యక్షుడు

Jair Bolsonaro Hospitalized After 10 Days Of Hiccups - Sakshi

బ్రసీలియా: జైర్‌ బోల్సోనారోను 10 రోజులుగా వెక్కిళ్లు వేధించసాగాయి. ఆయన పేగులో  సమస్య తలెత్తిందని.. ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స అవసరమని బ్రెజిల్‌ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బోల్సోనారోను పరీక్షల కోసం సావో పాలోలోని విలా నోవా స్టార్  ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కార్యాలయం బుధవారం పేర్కొంది. ఈ ఘటనపై బోల్సోనారో కుమారుడు ఫ్లావియో మాట్లాడుతూ.. తన తండ్రి బోల్సోనారోను బ్రసిలియాలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా బోల్సోనారో సావో పాలో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే.. ఆస్పత్రిలో బెడ్‌పై పడుకుని పడుకుని, సెన్సార్లు, కేబుళ్లు అమర్చి చికిత్స అందిస్తున్న ఫోటోను పేస్‌బుక్‌లో "ప్రతి ఒక్కరి మద్దతు,  ప్రార్థనలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ  పోస్ట్‌ చేశారు.  కాగా జైర్ బోల్సోనారో 2018లో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై కత్తితో దాడి చేశారు. 

ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొవాగ్జిన్‌ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్‌ సుప్రీం కోర్టు, బ్రెజిల్‌ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది.

కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ బ్రెజిల్‌ అధ్యక్షుడు  జైర్‌ బోల్సోనారో ఖండించారు. అయితే ఇటీవలి జరిగిన ఎన్నికల్లో అతనిపై జనాదరణ తగ్గిపోతోంది. దీంతో ఇది వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొంటు​న్నాయి. ఇక జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 5,35,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top