ఇరాన్‌ రాజకీయాల్లో కలకలం.. ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు? | Iranian officials too afraid to bury Ali Khamenei | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ రాజకీయాల్లో కలకలం.. ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు?

Apr 19 2026 4:52 PM | Updated on Apr 19 2026 5:08 PM

Iranian officials too afraid to bury Ali Khamenei

టెహ్రాన్‌: ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మరణించి నెలలు గడుస్తున్నా,ఆయన అంత్యక్రియలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దీనికి కారణం ఇరాన్‌ ప్రభుత్వంలో నెలకొన్న భయాలేనని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఖమేనీ అంత్యక్రియలను బహిరంగంగా నిర్వహిస్తే భారీ ఎత్తున జనసమూహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంత్యక్రియలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

మార్చి 4న మూడు రోజుల పాటు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా–ఇజ్రాయెల్‌ వరుస దాడుల కారణంగా ఆ ప్రణాళికను విరమించుకుంది. ఫలితంగా ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినా, ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

1989లో ఇస్లామిక్ విప్లవ నాయకుడు, తొలి సుప్రీం లీడర్‌ రుహుల్లా మోసావీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన అంత్యక్రియలు భారీ ఎత్తున జరిగాయి. లక్షలాది మంది ప్రజలు తేహ్రాన్‌ వీధుల్లోకి పోటెత్తారు. కానీ అలీ ఖమేనీ మరణం తర్వాత అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం విశేషం.

ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇరాన్‌ విశ్లేషకుడు బెహ్నామ్ బెన్ తలెబ్లూ మాట్లాడుతూ.. ఇరాన్‌ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేనంత బలహీనంగా ఉంది. ప్రజా వీధులు తమవని ఎప్పుడూ చెప్పుకుంటుంది. కానీ వాస్తవానికి ప్రజలు నిరసనలకు దిగుతారనే భయంతో 50 రోజుల పాటు ఇంటర్నెట్‌ను బ్లాక్ చేసింది” అని వ్యాఖ్యానించారు.

అంత్యక్రియల ఆలస్యానికి కారణాలుగా వైమానిక దాడుల ముప్పు, జాతీయవాద నిరసనలు మళ్లీ చెలరేగే అవకాశం, అలాగే మోజ్తబా ఖమేనీ ఖననానికి ఆశించిన స్థాయిలో ప్రజల ముందుకు రాకపోవడం వంటి కారణాలుగా అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్‌ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఖమేనీ స్వస్థలం మష్హాద్‌ నగరాన్ని అంత్యక్రియల స్థలంగా పరిశీలిస్తున్నారు. మష్హాద్‌లోని ఇమామ్ రెజా దర్గా షియా ముస్లింలకు పవిత్ర స్థలం. అక్కడే ఖమేనీని సమాధి చేయాలన్న ప్రతిపాదన ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement