ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఇరాన్కు అమెరికా మరో సాలిడ్ వార్నింగ్ ఇచ్చింది. రెడ్ లైన్ దాటేసిందని.. ఇక తీవ్ర చర్యలు తప్పదన్నట్లుగా తీవ్ర సంకేతాలు పంపించింది. ఈ మేరకు అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా.. కవ్వింపు చర్యలకు దిగినా.. తాము అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని టెహ్రాన్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(భారత కాలమానం ప్రకారం) ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు..
‘‘ఇరాన్ పరిణామాలను అమెరికా సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఆందోళనకారుల పట్ల అక్కడి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు మేం చూస్తూ ఊరుకోం. మేము బలమైన చర్యలపై పరిశీలిస్తున్నాం. గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఆ నిర్ణయం త్వరలోనే ఉంటుంది’’ అని ట్రంప్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా..
ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చల అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఇరాన్ ప్రతిపక్షాలు తనతో టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. అటు అమెరికాలో ఉంటూ ఇరాన్ నిరసనలను ప్రొత్సహిస్తున్న బహిష్కృత ఇరాన్ యువరాజు రేజా పహ్లవి రేపోమాపో ట్రంప్తో భేటీ కాబోతున్నారు. దీంతో ఖమేనీని గద్దె దించేందుకు అమెరికా అధ్యక్షుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ సలహాదారులతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్లు వైట్హౌజ్ వర్గాలు చెబుతున్నాయి.
కరెన్సీ పతనం, బడ్జెట్లో సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయాలు, ధరల పెరుగుదల.. ఇలా ఒక్కో నిర్ణయాలు ఖమేనీ పాలనపై అక్కడి ప్రజలకు విరక్తి కలిగించాయి. గతేడాది డిసెంబర్ 28న తేదీన టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభమైన నిరసనలు.. భద్రతా బలగాల అణచివేత చర్యలతో హింసాత్మకంగా మారాయి.
హక్కుల సంఘాల లెక్క ప్రకారం.. ఇప్పటిదాకా 500 మందికి పైగా మరణించారు. 10,600 మందిని అక్రమ అరెస్ట్ చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆందోళనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆ కథనాలను కూడా వండి వారుస్తున్నట్లు మండిపడింది. ఇరాన్పై దాడి జరిగితే, ఇజ్రాయెల్తో పాటు అన్ని అమెరికా బేస్లు, నౌకలు మా లక్ష్యాలు అవుతాయి అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపు ఇచ్చారాయన.
2022 తర్వాత ఇరాన్లో ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనలివే. హిజాబ్ ధరించలేదని ఓ యువతిపై మోరల్ పోలీసింగ్ ప్రయోగించగా.. అనుమానాస్పద రీతిలో ఆమె ఆస్పత్రిలో మరణించింది. దీంతో యువతులు పెద్ద ఎత్తున ఇరాన్ వీధుల్లోకి చేరి ఉద్యమించారు. అయితే ఖమేనీ ప్రభుత్వం వాటిని అణచివేసింది.
ఇరాన్పై చర్యలకు అమెరికా ముందున్న ఆప్షన్లు: సైనిక దాడులు, సీక్రెట్ సైబర్ ఎటాక్స్, ఇరాన్పై అత్యంత కఠిన ఆంక్షలు, చివరగా.. అక్కడి ప్రతిపక్ష నేతలకు, నిరసనలు తెలియజేస్తున్న గ్రూపులకు డిజిటల్ మద్దతు ఇవ్వడం. ఇరాన్లో ఇంటర్నెట్ నిషేధం అమల్లో ఉండడంతో.. అక్కడేం జరుగుతుందో బయటి దేశాలకు తెలియని పరిస్థితి. ఈ క్రమంలో.. టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్తో మాట్లాడి స్టార్లింక్ (శాటిలైట్ ఆధారిత) ద్వారా ఇరాన్లో ఇంటర్నెట్ పునరుద్ధరించాలనుకుంటున్నట్లు ట్రంప్ చెబుతున్నారు.


