మిత్ర దేశాలకు రాయితీలు ప్రకటించిన ఇరాన్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఒమన్ ప్రభుత్వంతో కలిసి ఇందుకు సంబంధించిన నిబంధనలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఈ చార్జీలు అందరికీ ఒకేలా ఉండవని తెలిపింది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మిత్ర దేశాలకు చార్జీల్లో రాయితీలు, మినహాయింపులు ఇస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. చైనా రాజధాని బీజింగ్లో జరిగిన వరల్డ్ పీస్ ఫోరమ్ కార్యక్రమం వేదికగా ఇరాన్ రాయబారి అబ్దుల్ రజా రహ్మానీ ఫజ్లీ ఈ విషయం వెల్లడించారు.
‘హార్మూజ్ జలసంధి మా ప్రాంతీయ జలాల్లో భాగం. అందుకే కచ్చితంగా సేవా రుసుము వసూలు చేస్తాం’ అని ఫజ్లీ పేర్కొన్నారు. ఈ రుసుమును టోల్గా భావించరాదని ఆయన నొక్కి చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ కీలక జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఎలాంటి పన్నులు, టోల్ ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గల్ఫ్ దేశాలు గట్టిగా కోరుతున్న వేళ ఇరాన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
ప్రపంచ చమురు, ఎల్పీజీ గ్యాస్ అవసరాల్లో ఐదో వంతు ఈ జలసంధి గుండానే రవాణా అవుతున్న విషయం తెల్సందే. అందుకే, ఇటీవల 60 రోజులపాటు హార్మూజ్ను ఇరాన్ మూసివేయడంతో ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగాయి.


