
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్ ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. దీంతో, గాజాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటికే హమాస్కు చెందిన కీలక నేతలు హతమయ్యారు.హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు. గతేడాది అక్టోబర్లో యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ బలగాలు హతమర్చాయి. అయితే, అంతకుముందే సిన్వర్ సతీమణి పరారైందని తాజాగా వెల్లడైంది. ఆమె.. తుర్కియేకు వెళ్లి అక్కడ మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.
పలు మీడియా కథనాల ప్రకారం.. యహ్యా సిన్వర్ భార్య సమర్ ముహమ్మద్ అబు జమార్ ప్రస్తుతం తుర్కియేలో రహస్యంగా జీవిస్తోందని సమాచారం. గాజాకు చెందిన ఓ సామాన్య మహిళకు చెందిన పాస్ పోర్టు సాయంతో సమర్ తన పిల్లలను తీసుకుని దేశం దాటిందని, తొలుత ఈజిప్ట్ లోకి అక్కడి నుంచి తుర్కియేలోకి ప్రవేశించిందని తెలిపింది. ఆ తర్వాత అక్కడి స్థానికుడిని వివాహం చేసుకుని మారుపేరుతో తుర్కియేలోనే జీవిస్తోందని వై నెట్ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారం హమాస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే నెట్ వర్క్ సాయంతో జరిగిందని పేర్కొంది. ఇదే మార్గంలో యహ్యా సిన్వర్ సోదరుడి భార్య నజ్వా కూడా దేశం దాటిందని తెలిపింది. అయితే, నజ్వా ఏ దేశంలో ఆశ్రయం పొందిందనే వివరాలు తెలియరాలేదని వివరించింది.
అయితే, హమాస్పై ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ మరణించడానికి ముందుగానే సమర్ తన పిల్లలతో కలిసి దొంగ పాస్ పోర్టుతో దేశం దాటినట్లు గాజాలోని హమాస్ వర్గాలు వెల్లడించాయని వై నెట్ మీడియా ఓ కథనంలో పేర్కొంది. గాజాలోని స్మగ్లింగ్ ముఠా సమర్ను రఫా బార్డర్ గుండా ఈజిప్టులోకి చేర్చిందని వై నెట్ పేర్కొంది. సాధారణంగా ఇలా మనుషులను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు స్మగ్లింగ్ ముఠాలు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తాయని తెలిపింది. దీంతో, ఆమె గురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, సమర్.. సిన్వర్ను 2011లో వివాహం చేసుకుంది.