థాయ్‌లాండ్‌లో 2వేల ఏళ్లనాటి బంగారు ఉంగరాలు | Gold rings around 2000 years old found during dig at Thailand archaeological site | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో 2వేల ఏళ్లనాటి బంగారు ఉంగరాలు

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

Gold rings around 2000 years old found during dig at Thailand archaeological site

మట్టిలో కూరుకుపోయిన ఉంగరాలను వెలికి తీస్తున్న అధికారి , బయటకు తీసిన బంగారు ఉంగరం

ఒక దానిపై బ్రాహ్మీ లిపి 

తవ్వకాల్లో బయల్పడిన పురాతన వస్తువులు, మానవ అవశేషాలు

బ్యాంకాక్‌: పశ్చిమ థాయ్‌లాండ్‌లో ఫెట్చాబురీ ప్రావిన్స్‌లో తాజాగా జరిపిన తవ్వకాల్లో ఏకంగా 2,000 సంవత్సరాల క్రితంనాటి రెండు బంగారపు ఉంగరాలు లభ్యమయ్యాయి. వీటలో ఒకదానిపై బ్రాహ్మీ లిపిలో రాసిన అక్షరాలున్నాయి. దీంతో ఈ అంగుళీకాలు భారత్‌కు చెందినవని భావిస్తున్నారు. గత వారం బాన్‌లాట్‌ జిల్లాలోని డోన్‌ యీ థాంగ్‌ పురాతత్వ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఈ ఉంగరాలు బయటపడ్డాయి. ఒక ఉంగరంపై బ్రాహ్మీ లిఫిలో పుషరకిత్సవా అని రాసి ఉన్నట్లు పురాతత్వ శాస్ట్ర నిపుణులు ఒకరు వెల్లడించారు.

పుషరకిత్సవా అంటే ఆనాటి భాష ప్రకారం పుష్య పరిరక్షణలో ఉండటం. అంటే భారతీయ రాశిచక్రం ప్రకారం పుష్యమీ నక్షత్రబలం ఉండటం అని అర్థం. భారతీయ ప్రాచీన కుల వ్యవస్థలో వైశ్యులకు సంబంధించిన వ్యాపారికి చెందిన ఉంగరంగా దీనిని భావిస్తున్నారు. వేల సంవత్సరాల క్రితమే థాయిలాండ్‌ ప్రాంతవాసులతో భారతీయులు వాణిజ్యం జరిపేవారని, సత్సంబంధాలు కొనసాగించారనడానికి ఇవి మరో ప్రబల నిదర్శనాలు అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదే ప్రాంతంలో లభించిన మానవ అవశేషాల పక్కనే మరో బంగారు ఉంగరాన్నీ గుర్తించారు.

దీనిపై ఎలాంటి రాతలు లేవు. బ్యాంకాక్‌కు కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే ఈ పురాతన ప్రాంతముంది. ఈ ఏడాది తొలినాళ్లలో ఇక్కడికి సమీప ప్రాంత వరిపొలంలో పురాతన కంచు డోలును స్థానికుడు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చాడు. ఆ డోలు సైతం 2,100 నుంచి 2,700 సంవత్సరాల పురాతనమైదని థాయ్‌లాండ్‌ పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనిని జాగ్రత్తగా ప్రభుత్వానికి అప్పగించినందుకు స్థానికుడు ఖేమ్‌థాయి సిట్టినశ్రీకి థాయ్‌లాండ్‌ లలితకళల విభాగ డైరెక్టర్‌ జనరల్‌ ఫానోమ్‌భట్‌ ఛంతరచోట్‌ 2,00,00 థాయ్‌ బాత్‌ కరెన్సీని బహుమతిగా ఇచ్చారు.

ఇనుపయుగంలో థాయ్‌లాండ్‌ ప్రాంతంలో ఆధునిక నాగరికులు స్థిరనివాసం ఏర్పర్చుకున్న ప్రాంతంగా దీనికి పేరుంది. గత ఐదు నెలలుగా జరుగుతున్న తవ్వకాల్లో ఇక్కడ ఎనిమిది మానవ అవశేషాలు, ఇత్తడి, బంగారు ఆభరణాలు, మట్టి పాత్రలు, ఇతర అలంకరణ వస్తువులను కనుగొన్నారు. ఆనాటి సమాజంలో ఉన్నతవర్గాలను ఖననం చేసే ప్రాంతం ఇక్కడే ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఛుంఫామ్‌ ప్రావిన్స్‌లోని ఖోవ్‌సామ్‌ ఖేయీ జిల్లా, క్రాబీ ప్రావిన్స్‌లోని క్లాంగ్‌ థోమ్‌ జిల్లాలోనూ తవ్వకాలు జరిపారు. అక్కడా పురాతన బ్రాహ్మీ లిపి రాసి ఉన్న పురాతన వస్తువులు, అలంకరణ వస్తువులను వెలికితీశారు.

మరో నెలరోజులపాటు తవ్వకాలు జరిపి మొత్తంగా లభ్యమైన పురాతన వస్తువులతో వస్తు ప్రదర్శన ఏర్పాటుచేస్తామని లలితకళ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ ఫానోమ్‌భట్‌ ప్రకటించారు. తవ్వకాల్లో లభించిన వస్తువులన్నింటినీ రాట్చభూరి ప్రావిన్స్‌లోని ఫ్రా నఖూన్‌ ఖిరీ మ్యూజియానికి తరలించారు. తవ్వకాలు జరిపే చోట భారీ వర్షాలు పడుతుండగా, కొన్ని చోట్ల భూగర్భజలాలు ఉబికివస్తున్నాయి. దీంతో పరిరక్షణ చర్యలు చేపడుతూ జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement