వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్తో వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్పై విరుచుకుపడుతూ మాట్లాడారు.
ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.
మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.
కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.


