అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్పై సాగిస్తున్న యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన తరుణంలో మరో కొత్త అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. . ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచ చమురు సరఫరాకు సవాల్ విసురుతుండగా, ఇప్పుడు కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తే ఏమటనే ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఇంటర్నెట్ కేబుళ్లు హార్మూజ్ జలసంధి గుండా వెళ్తాయి.
చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం ఇరాన్పై దాడులు సాగిస్తున్న తరుణంలో మరి ఆ దేశం హోర్ముజ్ జలసంధి ఇంటర్నెట్ కేబుళ్లను నిలిపివేస్తే పరిస్థితి ఏమిటి? అనేది పలుదేశాలను పట్టి పీడిస్తోంది. టెహ్రాన్ లక్ష్యం ఇంటర్నెట్ను నిలిపివేస్తుందా? అనేది ఇప్పుడు తలెత్తున్న ప్రశ్న.
మరొకవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మండేబ్పై కూడా ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేయవచ్చనే భయాలు ఉన్నాయి. ప్రపంచ డిజిటల్ జీవనాధారాలు కూడా సముద్రగర్భ కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండానే వెళ్తాయి. ఇది యూరప్-ఆసియా వాణిజ్యానికి అత్యంత కీలకం. ఇక్కడ కేబుల్స్ను కట్ చేస్తే ఆ ప్రాంతాల వాణిజ్యంతో పాటు ఇంటర్నెట్కు కూడా విఘాతం ఏర్పడుతుంది. అటు హోర్ముజ్ జలసంధి, ఇటు ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ను ఇరాన్ కానీ, ఇరాన్కు మద్దతిచ్చే హౌతీలు కానీ కట్ చేస్తే మాత్రం చాలా దేశాల్లో ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఎర్ర సముద్రంలో యెమెన్కు చెందిన హౌతీ గ్రూపులు ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరుపుతుండటంతో, ఆ ఇరుకైన జలమార్గం కూడా ప్రమాదకర ప్రాంతంగా మారింది.
పూర్తిగా ఆగదు.. కానీ
ఇరాన్ హోర్ముజ్ సముద్ర మార్గంలోని అండర్సీ కేబుల్స్ను కత్తిరిస్తే ప్రపంచ ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు, కానీ తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ వేగం తగ్గడం, కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, గ్లోబల్ డేటా ట్రాఫిక్కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, హోర్ముజ్, బాబ్ ఎల్-మండెబ్ వంటి చోక్ పాయింట్స్ చాలా కీలకమైనవిగా ఉన్నాయి. మొత్తంగా, ఇరాన్ హోర్ముజ్ లేదా బాబ్ ఎల్-మండెబ్ వద్ద కేబుల్స్ను దెబ్బతీస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నెమ్మదిస్తుంది,
హోర్ముజ్ అండర్సీ కేబుల్స్ ప్రాముఖ్యత
హోర్ముజ్ సముద్ర మార్గం: ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యాన్ని కలిపే ప్రధాన ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ ఇక్కడ గుండా వెళ్తాయి.
95% అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ సముద్రపు కేబుల్స్ ద్వారానే జరుగుతుంది.
భారతదేశం: పశ్చిమ దిశలో వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్లో మూడో వంతు హోర్ముజ్ మీద ఆధారపడి ఉంటుంది.


