కొన్ని దశాబ్దాల పాటు ఇరాన్ రాజకీయాలను, సైనిక వ్యూహాలను తన కనుసన్నలతో శాసించిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రస్థానం ఊహించని రీతిలో ముగిసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఆయన మరణించినట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
విప్లవ వీరుడి నుంచి సుప్రీం లీడర్ వరకు..
1939లో మషద్లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో జన్మించిన ఖమేనీ ప్రస్థానం ఒక పోరాట గాథలా సాగింది. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి షా మహమ్మద్ రెజా పహ్లావీ అణచివేత పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. విప్లవం విజయవంతం అయ్యాక, ఇరాన్ గణతంత్ర వ్యవస్థలో తిరుగులేని నేతగా ఎదిగి, 1981 నుండి 1989 వరకు దేశ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి తనదైన పాలన సాగించారు.
నాడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకుని..
ఖమేనీ జీవితంలో 1981 నాటి హత్యాయత్నం ఒక కీలక మలుపు. నాటి దాడిలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆయన కుడి చేయి పాక్షికంగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుండి ఆయన తన వైకల్యాన్ని కూడా ఒక శక్తిగా మార్చుకుని, దేశాన్ని నడిపించడంలో ముందున్నారు. 1989లో ఖొమేనీ మరణానంతరం ఇరాన్ ‘అత్యున్నత నాయకుని’గా బాధ్యతలు చేపట్టి, మూడు దశాబ్దాలకు పైగా దేశ భవిష్యత్తును తన వేళ్లతో శాసించారు.
ప్రాంతీయ శక్తిగా ఇరాన్ విస్తరణ
ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లోని ఇరాన్ అనుకూల వర్గాలకు అండగా నిలుస్తూ, అమెరికా, ఇజ్రాయేల్లకు ఖమేనీ నిరంతరం సవాలు విసిరారు. ఆయన హయాంలోనే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచ దేశాల దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
ఉక్కుపాదంతో అంతర్గత అణచివేత
బాహ్య శత్రువులనే కాకుండా, అంతర్గతంగా తలెత్తిన అసమ్మతిని కూడా ఖమేనీ కఠినంగా ఎదుర్కొన్నారు. 2009 నాటి ‘గ్రీన్ మూవ్మెంట్’ నిరసనలు, అలాగే 2019, 2022లలో ప్రజల నుంచి వచ్చిన తీవ్ర తిరుగుబాట్లను ఆయన తన అధికార బలంతో పూర్తిగా అణచివేశారు. తనను తాను ఇరాన్ సార్వభౌమాధికార రక్షకుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, ఆయన పాలనలో రాజకీయ స్వేచ్ఛ కరువైందన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి.
అగ్రరాజ్యంతో అలుపెరుగని పోరాటం
అమెరికాతో ఖమేనీకి ఉన్న వైరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా 2015 నాటి అణు ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ వైదొలగడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ట్రంప్ ఇరాన్ సుప్రీం ఖమేనీని అత్యంత క్రూరమైన వ్యక్తిగా, ఆయన వర్గాన్ని ‘రక్తపిపాసి ముఠా’గా అభివర్ణించారు. అయితే ఖమేనీ ఏనాడూ అమెరికా ఒత్తిళ్లకు లొంగలేదు. ట్రంప్ ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రతీకార జ్వాలల్లో మధ్యప్రాచ్యం
ఖమేనీ అంతంతో ఇరాన్ తన ‘ట్రూత్ ఫుల్ ప్రామిస్ 4’ ఆపరేషన్ను ప్రారంభించి, అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అబుదాబి, దోహాలతో పాటు బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై పడుతున్న క్షిపణులు ఈ ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతను మరింతగా పెంచాయి.
ఇది కూడా చదవండి: ఖమేనీ మృతితో నెతన్యాహు పరారీ?


