‘స్వాతంత్య్రం’ దొరికింది | America will celebrate 250 years of independence | Sakshi
Sakshi News home page

‘స్వాతంత్య్రం’ దొరికింది

Jul 4 2026 5:44 AM | Updated on Jul 4 2026 5:44 AM

America will celebrate 250 years of independence

అత్యంత అరుదైన అమెరికా డిక్లరేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌ ప్రతి లభ్యం

యూకే నేషనల్‌ ఆర్కైవ్స్ లో గుర్తించిన ఉద్యోగి

అమెరికా విముక్తికి నేటితో 250 ఏళ్లు పూర్తి

లండన్‌: నేడు అగ్రరాజ్యంగా, ప్రపంచానికి పెద్దన్నగా వెలిగిపోతున్న యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా(యూఎస్‌ఏ) సరిగ్గా 250 ఏళ్ల క్రితం స్వతంత్ర దేశంగా అవతరించింది. బ్రిటిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందింది. అమెరికా స్వతంత్ర ప్రకటన(డిక్లరేషన్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌)పై థామర్‌ జెఫర్సన్, బెంజమిన్‌ ఫ్రాంక్లిన్, జాన్‌ ఆడమ్స్‌ తదితర ప్రముఖులతో సహా 56 మంది ప్రతినిధులు సంతకాలు చేశారు. 1776 జూలై 4 నుంచి ఈ డిక్లరేషన్‌ అమల్లోకి వచి్చంది. ఈ స్వాతంత్య్ర ప్రకటనకు సంబంధించిన అత్యంత అరుదైన ప్రతి యూకే నేషనల్‌ ఆర్కైవ్స్ లో లభించింది.

మైఖేల్‌ స్కర్‌ అనే మాజీ ఇన్సూరెన్స్‌ ఉద్యోగి అనుకోకుండా దీన్ని గుర్తించారు. ఆయన బ్రిటన్‌ నేషనల్‌ ఆర్కైవ్స్ లో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. భవిష్యత్తులో పరిశోధకులకు ఉపయోగపడేలా ప్రతి గురువారం అరుదైన పత్రాలను విభాగాలవారీగా వర్గీకరిస్తూ ఉంటారు. మే నెలలో ఒక రోజు 18వ శతాబ్దపు రాయల్‌ నేవీ కెప్టెన్‌ రాసిన లేఖలను పరిశీలిస్తుండగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.1776లో క్రిస్మస్‌ పండుగ నాడు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన నివేదికకు జతచేసిన ఒక అనుబంధ పత్రాన్ని గుర్తించారు. మొదట అదొక సాధారణ పత్రమే అనుకున్నారు. దాని పైభాగంలో ‘డిక్లరేషన్‌’ అనే పదం ముద్రించి ఉండటాన్ని చూసి ఆగిపోయాడు.

అది అమెరికా స్వతంత్ర ప్రకటన పత్రమేనని నిర్ధారించుకున్నాడు. అప్పట్లో ఇండిపెండెన్స్‌ డిక్లరేషన్‌కు మొదట కొన్ని ప్రతులను(కాపీలు) తయారు చేశారు. 1776 జూలై 4న అసలు పత్రంపై సంతకాలు జరిగిన కొద్ది రోజులకే... జూలై 16 నుంచి 19 దాకా న్యూహ్యాంప్‌షైర్‌లో మొత్తం 11 కాపీలను ఎక్స్‌టర్‌ ప్రింటింగ్‌ విధానంలో ముద్రించారు. వీటిని కూడా అసలైన డిక్లరేషన్‌ ప్రతులుగానే పరిగణిస్తుంటారు. కాలక్రమంలో అవి చాలావరకు కనిపించకుండాపోయాయి. ఒక్కటి మాత్రం అమెరికాలో కాకుండా యూకే జాతీయ ఆర్కైవ్స్‌లో మైఖేల్‌ స్కర్‌కు దొరకడం విశేషం. అమెరికా స్వాతంత్య్ర ప్రకటన అసలు పత్రం ప్రస్తుతం అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ ఆర్కైవ్స్  మ్యూజియంలో భద్రంగా ఉంది.

నేటి నుంచి స్వాతంత్య్ర సంబరాలు
అమెరికా 250 స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ 250వ వార్షికోత్సవ వేడుక దేశ చరిత్రలోనే అత్యంత భారీ జాతీయ కార్యక్రమంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. పలు కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మొత్తం వేర్వేరు ఈవెంట్లు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రజలు తమ ఇళ్లల్లో వ్యక్తిగతంగానూ వేడుకలు నిర్వహించుకోవడానికి సిద్ధమవుతున్నారు. దుకాణాల్లో అమెరికా జాతీయ జెండాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

సౌత్‌ డకోటాలో జరిగే కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగిస్తారు. అలాగే మౌంట్‌ రష్‌మోర్‌లో బాణాసంచా విన్యాసాలను తిలకిస్తారు. వాషింగ్టన్‌లోని నేషనల్‌ మాల్‌ వద్ద ట్రంప్‌ మరో ప్రసంగం చేయనున్నారు. జూలై 4న సెలవు దినానికి స్వాగతం పలికేందుకు న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో అర్ధరాత్రి వేళ ‘బాల్‌ డ్రాప్‌’ కార్యక్రమం జరగనుంది.

శనివారం అమెరికా వ్యాప్తంగా బాణాసంచా వేడుకలు, వంటల కార్యక్రమాలు, బ్లాక్‌ పారీ్టలు జరుగుతాయి. 200వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరిగినప్పుడు యువకులుగా ఉన్నవారు నేడు వృద్ధులయ్యారు. అప్పటి సంబరాలను వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ ప్రభావం స్వాతంత్య్రం దినోత్సవాలపై పడే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement