ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అడియాలా జైలు అధికారులు ఖండించారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య సంరక్షణ, పర్యవేక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 2023 నుండి నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో పలు వదంతులు వ్యాపిస్తున్న నేపధ్యంలో అడియాలా జైలు అధికారులు ఈ ప్రకటన చేశారు.
తన సోదరుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ జైలు సమీపంలో ధర్నా నిర్వహించారు. తన సోదరుడిని చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఈ నిరసన కారణంగా అడియాలా జైలు రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అయితే ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు వచ్చే మంగళవారం అతనిని కలిసేందుకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
ఇదేవిధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను చర్చించేందుకు పీటీఐ నేతలకు ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది, పీటీఐ సెక్రటరీ జనరల్ సల్మాన్ అక్రమ్ రాజా తదితరులు జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలుసుకోనున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను జైలు అధికారులు ఖండించినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నా కుటుంబ సభ్యులపై జైలు అధికారుల ఆంక్షలు విధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కర్ణాటక: డిసెంబర్ ఒకటి లోగా కొత్త సీఎం?


