
సుంకిశాల పనుల్లో నిర్లక్ష్యం వద్దు
జలమండలి ఎండీ అశోక్రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: సుంకిశాల ప్రాజెక్టు పనుల డిజైన్లు వెంటనే సమర్పించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. పనుల నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన జలమండలి ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
పైపులైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం సుంకిశాల టన్నెల్ గేట్ రిటైనింగ్ వాల్ పక్కకు ఒరిగిన ప్రాంతాన్ని అశోక్రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎం మహేష్, జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.