
హైదరాబాద్ మహానగరంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరం తొలి పరీక్ష కావడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షకు అరగంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను ఆనుమతించారు. కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఇరుకు గదులు ఉండటంతో విద్యార్ధులు కొంత ఇబ్బందులకు గురయ్యారు. పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియట్, రెవెన్యూ అధికారులతోపాటు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. సైఫాబాద్ ఫిట్జీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇంటర్మీడియట్ విద్యాధికారి ఒడ్డెన్నతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఇక మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 5547 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు వెల్లడించారు. – సాక్షి, సిటీబ్యూరో