సాక్షి, వరంగల్: వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రేటర్ వరంగల్లో ఖాళీగా ఉంటున్న ఓపెన్ ప్లాట్లలో పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు దోమల స్వైరవిహారం చేయడంతో నగరవాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలను కలుపుకొని ట్రైసిటీలో 3వేలకుపైగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ట్రైసిటీలోనే ఒక్క ఆగస్టు నెలలోనే 500కుపైగా జ్వరాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక్క ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో నమోదైన గణాంకాలు మాత్రమే. ఇక ప్రైవేట్ ఆస్పత్రులను పరిగణనలోకి తీసుకుంటే సీజనల్ వ్యాధుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండొచ్చని వైద్యవర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
యజమానుల నిర్లక్ష్యంపై
కఠిన వైఖరి ఏదీ..?
యజమానులు స్థలాలను కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టకుండా వదిలేస్తున్నారు. కనీసం పిచ్చిమొక్కలు తొలగించడం, చెత్తను శుభ్రం చేయించడం లేదు. ఫలితంగా పిచ్చి మొక్కలు పెరిగి దోమలు, విష పురుగులకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమల తీవ్రత పెరగడంతో ప్రజల్లో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల భయం నెలకొంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారో గ్యంతో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ ప్లాట్లపై ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. ఖాళీ ప్లాట్లపై తొలుత వారంలో స్థలాన్ని చదును చేసుకోవాలని బల్దియా ఆదేశించవచ్చు. లేదంటే కార్మికులతో శుభ్రం చేయించాలి. చివరికి స్థల యజమానికి రూ.10వేల వరకు జరిమానా విధించే అధికా రం కమిషనర్కు ఉంటుంది. అయినా స్పందించకపోతే అక్కడ బోర్డు ఏర్పాటుచేసి భవిష్యత్లో ఇంటి నిర్మాణం నిలిపివేసే అవకాశం కూడా ఉంటుంది. దీనిపై ప్రజారోగ్య విభాగాధికారి రాజారెడ్డి మాత్రం ఖాళీస్థలాల విషయంలో బల్దియా నుంచి నోటీసులివ్వడంతో కొందరు యజమానులు ముందుకొచ్చి పరిశుభ్రం చేసుకుంటున్నారని సమాధానమిచ్చారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో
3వేలకుపైగా ఓపెన్ప్లాట్లు
నివాసాల మధ్యలో ఉండడంతో దోమల విజృంభణ
సీజనల్ వ్యాధుల బారిన
నగరవాసులు
కట్టుదిట్టమైన చర్యలు
తీసుకుంటేనే రోగాలకు కల్లెం


