వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన ఇంజనీర్లే కాంట్రాక్టర్ల మధ్య సయోధ్య కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ అను యాయులకు పనులు కట్టబెట్టేందుకు విశ్వప్రయత్నాలు చే స్తున్నారన్న విమర్శలున్నాయి. తాము చెప్పిన ప్రాంతాల్లో టెండర్లు వేసుకోవాలని ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానాలకు తూట్లు పొడిచారని, తక్కువ లెస్కు పోవా లని నిబంధనలు పెట్టి, చిన్నాచితక కాంట్రాక్టర్లను భయబ్రాంతులకు గురిచేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ముగిసిన గడువు..
సెప్టెంబర్లో జరగనున్న గణేశ్ విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో లైట్లు, జనరేటర్లు ఏర్పాటు చేసేందుకు వరంగల్ నగరంలోని 12 ప్రాంతాల్లో సుమారు రూ.30 లక్షలతో ఈ నెల 21న ‘ఆన్లైన్’ టెండర్లకు ఆహ్వానించగా, ఈ నెల 27 (గురువారం) మధ్యాహ్నంతో గడువు ముగిసింది. గత మూడు, నాలుగు రోజులుగా బల్దియా ఎలక్ట్రికల్ విభాగా నికి చెందిన ఇద్దరు ఇంజనీర్లు రంగంలోకి దిగారని, పలా నా ప్రాంతంలో సదరు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ టెండర్ వేస్తారని, అక్కడ మీరు వేస్తే నష్టపోతారని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ టెండర్ వేస్తే సద రు కాంట్రాక్టర్కు సగం పనులు అప్పగించాలని ఒత్తిళ్లు తెచ్చినట్లు కరొందరు బాహాటంగా వెల్లడించడం గమనార్హం. అందరూ కలిసి పనులు పంచుకోవాలని తక్కువశాతం టెండర్ వేయాలని చెప్పడంపై ఇంజనీర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్, ఉద్యానవన అభివృద్ధి పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్గా మారి పనులు పంచుకుంటుండడం.. బడా కాంట్రాక్టర్లకు ఇంజనీర్లు ఇతోధికంగా సహకరిస్తున్నారన్నది బల్దియా బహిరంగ సత్యం. ఈ విషయంపై సదరు ఎలక్ట్రికల్ ఇంజనీర్లను వివరణ కోరగా సమాధానం దాటవేశారు. ఎవరు ఎక్కువ లెస్కు టెండర్ వేస్తే వారికే దక్కుతుందని చెప్పుకొచ్చారు.
అనుయాయులకు పనులు
కట్టబెట్టేందుకు యత్నాలు
‘గ్రేటర్’ పరిధిలోని గణేశ్ నిమజ్జన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పనులకు ముగిసిన టెండర్ల గడువు
చిన్నాచితకా కాంట్రాక్టర్లను
బెదిరిస్తున్నారనే ఆరోపణలు


