ఖిలా వరంగల్: ఆదివాసీ, గిరిజన సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జూనియర్ సివిల్ జడ్జి రాజ్ నిధి అన్నారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వరంగల్ యాకూబ్పురంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో గిరిజనుల హక్కులు, చట్టపరమైన రక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం, ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సివిల్ జడ్జి రాజ్నిధి హాజరై మాట్లాడారు. గిరిజనులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సాయం పొందవచ్చునని సూచించారు. సదస్సులో సబ్ ఇన్స్పెక్టర్ నిహారిక, న్యాయవాది పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ హేమంత్, సిబ్బంది పాల్గొన్నారు
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాతంగి ప్రవీణ్ తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు గ్రాండ్ మాస్టర్ ఎం.జయంత్రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 9న హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్తంగా తైక్వాండో పోటీలు నిర్వహించారు. మాతంగి ప్రవీణ్ బ్లాక్ బెల్ట్ మూడో డాన్ విభాగంలో పాల్గొని ప్రతిభ కనబర్చి తైక్వాండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించినట్లు తెలిపారు.
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేస్టేషన్లోని స్టేషన్ మాస్టర్ కార్యాలయంలో ఆదివారం టీడీ సేవర్ 101 ఎమర్జెన్సీ మెడికల్ బాక్స్ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ కిట్లో గాయాలకు డ్రెస్సింగ్లు, బ్యాండేజీలు, రక్తస్రావాన్ని నియంత్రించే సామగ్రి తదితర అత్యవసర వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయి. రైల్వేస్టేషన్, రైళ్లలో ప్రయాణికులు అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు ఈ మెడికల్ బాక్స్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు తెలిపారు.


