సమీక్షలో వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో వైరల్ హెపటైటిస్ నియంత్రణకు కృషిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్ర (ఎన్వీహెచ్సీపీ) అమలులో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హైరిస్క్ గ్రూపులకు హెపటైటిస్–బీ వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించారు. వ్యాప్తిని నివారించేందుకు తాగునీటి వనరుల క్లోరినేషన్ను సమర్థవంతంగా చేపట్టాలని, వ్యాధిపై విస్తృతస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రాజారెడ్డి, నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దామోదరబాయి, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉష, వర్ధన్నపేట డీసీహెచ్ఎస్ డాక్టర్ రామ్మూర్తి, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ నిర్మల, అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వ, ఎయిడెట్, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ–పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు అందించేందుకు మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యార్థి తప్పనిసరిగా మీసేవ కేంద్రంలో ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేసిన అనంతరం పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం హనుమకొండలోని బీసీ సంక్షేమాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


