రైల్వేశాఖ వరాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం (క్రూ లాబీ) కేంద్రంగా పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఇయర్ కానుకగా వరాలు కురింపించారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి కొత్తగా 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల సంఖ్యను పెంచుతూ మంజూరు చేసినట్లు బుధవారం రైల్వే అధికారులు, రైల్వే నాయకులు తెలిపారు. 16 మందికి గూడ్స్ లోకో పైలెట్ల నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో ఏడుగురికి ప్యాసింజర్ లోకో పైలెట్గా పదోన్నతి కల్పిస్తూ 9 మందిని సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్గా కాజీపేటకు బదిలీ చేసినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం నుంచి పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లోకో పైలెట్ల పోస్టుల ఇండెంట్ మంజూరు చేయాలని 3 ఏళ్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి వినతి పత్రాలు అందజేసినట్లు రైల్వే నాయకులు తెలిపారు. గతంలో కాజీపేట నుంచి విజయవాడకు తరలించిన క్రూ లింక్లను లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లను తిరిగి కాజీపేటకు తీసుకురావాలని అనేక సార్లు డీఆర్ఎం, జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆశించినట్లుగా లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల కేటాయింపు జరగలేదని రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాజీపేట రైల్వే క్రూ లాబీలో ఉన్న ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని అనేకసార్లు రైల్వే సికింద్రాబాద్ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. కాజీపేటలో డ్యూటీ చేసే వారికి కాజీపేటలోనే పదోన్నతి కల్పించాలి. బదిలీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి. ఖాళీలను భర్తీ చేయాలి.
– పాక రాజ్కుమార్, కాజీపేట రైల్వే సంఘ్ లోకో
రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్
130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులు మంజూరు
16 మందికి పదోన్నతులు
3 ఏళ్ల ఎదురు చూపులకు దక్కిన బదిలీల ఫలితం
ఆనందంలో రైల్వే లోకో పైలెట్ల స్టాఫ్


