రారమ్మంటున్న కార్యక్రమాలు.. | - | Sakshi
Sakshi News home page

రారమ్మంటున్న కార్యక్రమాలు..

Dec 31 2025 6:53 AM | Updated on Dec 31 2025 6:53 AM

రారమ్మంటున్న కార్యక్రమాలు..

రారమ్మంటున్న కార్యక్రమాలు..

రారమ్మంటున్న కార్యక్రమాలు..

సాక్షి, వరంగల్‌/వరంగల్‌ క్రైం : నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్‌ థర్టీ ఫస్ట్‌’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్‌, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్‌ హాల్స్‌, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్‌ గ్రౌండ్‌లు, భద్రకాళి బండ్‌ నయా జోష్‌కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మ్యూజిక్‌ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్‌ థర్టీ ఫస్ట్‌ జోష్‌లో వరంగల్‌ తేలిపోనుంది.

సంతోషాలతో వేడుకలు

నిర్వహించుకుందాం..

సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్‌ 31 రాత్రి నిర్వహించుకునే వేడుకల సందర్భంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వేడుకలను అర్ధరాత్రి 12.30 గంటల్లోపు ముగించుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా, పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. మత్తు పదార్థాలు వినియోగిస్తే చర్యలు తప్పవని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కితే జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రజల దృష్టికి వస్తే డయల్‌ 100కు సమాచారం అందించాలని సీపీ కోరారు.

విభిన్న థీమ్స్‌తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్‌ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నారు. వెబ్‌సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్‌ లిమిటెడ్‌ ఫుడ్‌, లిక్కర్‌ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్‌ ఉంది. వరంగల్‌లోని గ్రీన్‌వుడ్‌ హైస్కూల్‌ డే స్కాలర్‌ ప్రాంగణంలో రాక్‌ మ్యూజిక్‌ స్టార్‌ రోల్‌ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంక్‌ బండ్‌ వద్ద బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఫోక్‌ సింగర్‌ రాంరాథోడ్‌ లైవ్‌ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్‌ మ్యూజిక్‌, క్యాంప్‌ ఫైర్‌, బబుల్‌ థీమ్‌, ఫుడ్‌ స్టాల్స్‌తో థర్టీ ఫస్ట్‌ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్‌ సెంటర్‌లోనూ ఫుడ్‌తోపాటు ఆల్కహాల్‌ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్‌ బిగ్గెస్ట్‌ హిప్‌ హాప్‌ అండ్‌ ఫోక్‌ నైట్‌ మ్యూజిక్‌ సెలబ్రేషన్‌ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్‌ మ్యూజిక్‌, డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌, ప్రీమియం సౌండ్‌ అండ్‌ లైటింగ్‌, వీఐపీ జోన్లు, టేబుల్‌ సర్వీస్‌ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్లలు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్‌.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్‌ వేడుకల్లో జోష్‌ ఉండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement